పాకిస్థాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్) 2026 సీజన్ తొలి రోజే ఆ దేశ పరువు గంగలో కలిసింది. ఐపీఎల్ కంటే తమదే అత్యుత్తమ ఫ్రాంచైజీ లీగ్ అని గొప్పలు చెప్పుకునే పాకిస్థాన్.. ఆటగాళ్లకు నాణ్యమైన జెర్సీలను అందించలేక నవ్వుల పాలైంది. గురువారం జరిగిన ఈ సీజన్ తొలి మ్యాచ్లో నాసిరకం జెర్సీల రంగు అంటుకొవడంతో తెల్ల బంతి కాస్త పింక్ బాల్గా మారిపోయింది.
ప్రస్తుతం ఈ వ్యవహారం నెట్టింట తీవ్ర చర్చనీయాంశం కాగా.. పాకిస్థాన్ సూపర్ లీగ్ నిర్వాహకులపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సొంత అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లు పీఎస్ఎల్ నిర్వాహకులపై దుమ్మెత్తి పోస్తున్నారు. గల్లీ లెవల్ లీగ్ అని మండిపడుతున్నారు.
గడాఫీ స్టేడియం వేదికగా గురువారం జరిగిన పీఎస్ఎల్ 2026 సీజన్ ఆరంభ మ్యాచ్లో లాహోర్ ఖలందర్స్, హైదరాబాద్ కింగ్స్మెన్స్ జట్లు తలపడ్డాయి. హైదరాబాద్ కింగ్స్మెన్స్ జట్టు బౌలింగ్ వేస్తున్న సమయంలో బంతి ముందు పింక్.. ఆ తర్వాత రెడ్ కలర్లోకి మారిపోయింది. హైదరాబాద్ ఆటగాళ్ల జెర్సీ కలర్ అంటుకోవడంతోనే ఇలా వైట్ బంతి కాస్త రెడ్గా మారిపోయింది.
సాధారణంగా ఆటగాళ్లు బంతికి మెరుపు తెప్పించడం కోసం జెర్సీ, ప్యాంట్లకు రుద్దుతారనే సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే నాసిరకం జెర్సీల రంగు బంతికి అంటినట్లు తెలుస్తోంది. దాంతో పాక్ క్రికెట్ పరువు గంగలో కలిసింది. ఆట మధ్యలో బంతి ఇలా రంగు మారడంతో అంతా ఆశ్చర్యపోయారు. ఈ విషయమై హైదరాబాద్ కెప్టెన్ మార్నస్ లబుషేన్ అంపైర్కు సైతం ఫిర్యాదు చేశాడు. దాంతో అంపైర్లు పరిశీలించి బంతిని మార్చారు.

ఈ మ్యాచ్ అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో లబుషేన్ ఈ ఘటనపై ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.తన కెరీర్లోనే ఇలాంటి సందర్భం చూడలేదన్నాడు. 'రెండో ఓవర్ తర్వాత నేను అంపైర్కు బంతి కలర్ మారిందనే విషయాన్ని ఫిర్యాదు చేశాను. అసలు ఎలా బంతి మారింది? జెర్సీల వల్లే ఇలా కలర్ మారి ఉండవచ్చు. గతంలో నేను ఎప్పుడూ ఇలాంటి ఘటనను చూడలేదు.
బ్యాట్ రంగు కాస్త బంతికి అంటుకోవడం, బాల్ ప్యాడ్కు తగిలి దానిపై ఉన్న రంగు కొద్దిగా ఊడిపోవడం సర్వసాధారణం. కానీ జెర్సీల కలర్ బంతికి అంటుకోవడం నేను ఎప్పుడూ చూడలేదు. అప్కమింగ్ మ్యాచ్ల్లోనైనా జెర్సీలను మారుస్తారని ఆశిస్తున్నా.'అని లబుషేన్ తెలిపాడు.
ఈ మ్యాచ్లో లాహోర్ జట్టు 69 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన లాహోర్ ఖలండర్స్ 20 ఓవర్లలో 199 పరుగులు చేయగా.. హైదరాబాద్ జట్టు కేవలం130 పరుగులకే పరిమితమై ఘోర పరాజయం చవిచూసింది. లాహోర్ బ్యాటర్ ఫఖర్ జమాన్ (53) 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచాడు. హైదరాబాద్ కింగ్స్మెన్ జట్టులో ఎక్స్లో 'తమ మొదటి పింక్ బాల్ మ్యాచ్ గెలిచినందుకు ప్రత్యర్థి జట్టుకు అభినందనలు'అని సెటైర్లు పేల్చింది.