
కరాచీ: పాకిస్థాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్) 2023 సీజన్లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. తండ్రి కోచ్గా ఉన్న జట్టుపై కొడుకు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. దాంతో ఆ తండ్రి పుత్రోత్సాహంతో పొంగిపోయాడు. ఆయన ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఓ వైపు తన జట్టు ఓడినప్పటికీ.. కుమారుడి ప్రదర్శనపై అభినందనలు కురిపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
పాకిస్థాన్ క్రికెట్ దిగ్గజం మొయిన్ ఖాన్ ప్రస్తుతం పీఎస్ఎల్లో క్వెట్టా గ్లాడియేటర్స్కు కోచ్గా వ్యవహరిస్తున్నాడు. అతని కుమారుడు 24 ఏళ్ల అజామ్ ఖాన్ ఇస్లామాబాద్ యునైటెడ్కు ప్రాతినిథ్యం ఇస్తున్నాడు. క్వెట్టా గ్లాడియేటర్స్తో శుక్రవారం జరిగిన మ్యాచ్లో అజామ్ ఖాన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 42 బంతుల్లోనే 97 పరుగులు చేశాడు. దాంతో ఇస్లామాబాద్ సునాయస విజయాన్నందుకుంది.
ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇస్లామాబాద్ యునైటెడ్.. అజామ్ ఖాన్ ధాటికి నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 220 పరుగులు చేసింది. అనంతరం క్వెట్టా గ్లాడియేటర్స్ 157 పరుగులకే ఆలౌటై ఓటమిపాలైంది. కీలక ఇన్నింగ్స్ ఆడిన అజామ్ ఖాన్ను మొయిన్ ఖాన్ చప్పట్లు కొడుతూ అభినందిస్తున్న వీడియోను పీఎస్ఎల్ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది. ఈ మ్యాచ్లో అజామ్ ఖాన్ ఏకంగా 8 సిక్స్లు, 9 ఫోర్లు కొట్టడం విశేషం.
విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగిన అజామ్ ఖాన్.. తన తండ్రి వైపు చూస్తూ 'డాడ్ ఈ ఇన్నింగ్స్.. నీ కోసమే'అంటూ సైగలు చేశాడు. రెండేళ్ల కిందట అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగు పెట్టిన అజామ్ ఖాన్.. నిలకడగా రాణించలేక అవకాశాలు కోల్పోయాడు. ఆ తర్వాత మళ్లీ జాతీయ జట్టులోకి రాలేకపోయాడు. ఇప్పటి వరకు కేవలం మూడు టీ20లు మాత్రమే ఆడిన అజామ్ ఖాన్... అందులోనూ ఏడు బంతులను ఎదుర్కొని కేవలం 6 పరుగులు మాత్రమే చేశాడు. తండ్రిలానే అజామ్ ఖాన్ కూడా వికెట్ కీపర్. అయితే, మహమ్మద్ రిజ్వాన్ మంచి ఫామ్లో ఉండటంతో వైట్బాల్ క్రికెట్లో అవకాశాలు లభించడం లేదు.