
కరాచీ: కరోనా వైరస్ కారణంగా ఆగిపోయిన పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) శనివారం మళ్లీ మొదలైంది. లీగ్ మ్యాచ్లు దిగ్విజయంగా పూర్తి చేసుకున్న ఈ పాకిస్థాన్ టీ20 లీగ్.. మహమ్మారి కారణంగా ప్లే ఆఫ్స్ మ్యాచ్లు జరగలేదు. ఆ తర్వాత ఐపీఎల్ ప్రారంభం కావడంతో లీగ్ నిర్వహించే అవకాశం లేకుండా పోయింది. భారత క్యాష్ రిచ్ లీగ్ ముగియడంతో మళ్లీ పట్టాలెక్కింది. ముల్తాన్ సుల్తాన్, కరాచీ కింగ్స్ మధ్య కరాచీ వేదికగా క్వాలిఫయర్ 1 మ్యాచ్ ఫ్రారంభమైంది.
అయితే ఈ మ్యాచ్కు ముందు ఇరు జట్ల ఆటగాళ్లంతా ఇటీవల మరణించిన ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, కోచ్, వ్యాఖ్యాత డీన్ మెర్విన్ జోన్స్ (59)కు ఘనంగా నివాళులర్పించారు. డీన్ జోన్స్ కటౌట్తో 'D'ఆకారంలో నిలబడి మరీ సంతాపం తెలిపారు. ఈ వీడియోను పీఎస్ఎల్ నిర్వాహకులు సోషల్ మీడియా వేదికగా 'మా గుండేల్లోనే ఉన్నారు బాసూ'అనే క్యాప్షన్తో పంచుకోగా.. నెట్టింట వైరల్ అయింది. మనసులను కదిలించిన ఈ సన్నివేశాన్నిచూసిన క్రికెట్ అభిమానులు పీఎస్ఎల్ నిర్వాహకులను ప్రశంసిస్తున్నారు.
ఐపీఎల్ వ్యాఖ్యాతల బృందంలో సభ్యుడిగా ఉన్న జోన్స్ ముంబైలోని ఒక హోటల్లో సెప్టెంబర్ 24న హఠాన్మరణం చెందాడు. ఆయన మరణానికి ముందు రోజు రాత్రి ముంబై, కోల్కతా మధ్య జరిగిన మ్యాచ్కు కామెంటేటర్గా వ్యవహిరించాడు. అనంతరం స్టార్ స్పోర్ట్స్వారి ప్రత్యేక విశ్లేషణా కార్యక్రమంలో కూడా పాల్గొన్నాడు. ఆయన అకాల మరణానికి సంతాపంగా ఐపీఎల్ ఆటగాళ్లంతా బ్లాక్ రిబ్బన్స్తో మైదానంలోకి దిగగా.. కామెంట్రీ ప్యానెల్ ఆయన కుర్చీని అలానే ఉంచి నివాళులర్పించింది.
డీన్ జోన్స్ పదేళ్ల అంతర్జాతీయ కెరీర్లో ఎన్నో చిరస్మరణీయ ప్రదర్శనలు ఉన్నాయి. ఆస్ట్రేలియా సాధించిన అనేక విజయాల్లో అతను భాగంగా నిలిచాడు. జోన్స్ కెరీర్ మొత్తానికి హైలైట్గా నిలిచిన ఇన్నింగ్స్ 1986లో మద్రాసులో భారత్తో జరిగిన చారిత్రాత్మక 'టై' టెస్టులో వచ్చింది. తీవ్రమైన ఎండ, ఉక్కపోత మధ్య ఏకంగా 502 నిమిషాలు క్రీజ్లో నిలిచిన జోన్స్... 330 బంతుల్లో 27 ఫోర్లు, 2 సిక్సర్లతో 210 పరుగులు చేయడం అతడిని చిరస్థాయిగా నిలబెట్టింది. ఆట ముగిసిన తర్వాత హాస్పిటల్కు తీసుకెళ్లి జోన్స్కు సెలైన్లు ఎక్కించాల్సి వచ్చింది.
తన 8 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్లో 52 టెస్ట్లు, 164 వన్డేలు ఆడిన జోన్స్.. సంప్రదాయక ఫార్మాట్లో 11 సెంచరీలు, 14 హాఫ్ సెంచరీలతో 3631 రన్స్ చేశాడు. వన్డేల్లో 7 సెంచరీలు, 46 హాఫ్ సెంచరీలతో 6068 పరుగులు చేశాడు.