
కరాచీ: కరోనా కారణంగా ఆగిపోయిన పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) ప్లే ఆఫ్స్ మ్యాచ్లు శనివారం మళ్లీ మొదలయ్యాయి. కరోనా అంతరాయంతో ఆగిపోయిన ఈ లీగ్కు ఆ తర్వాత ఐపీఎల్ రూపంలో అడ్డంకి ఎదురైంది. ఇటీవల భారత క్యాష్ రిచ్ లీగ్ ముగియడంతో పీఎస్ఎల్ మళ్లీ పట్టాలెక్కింది.
ముల్తాన్ సుల్తాన్, కరాచీ కింగ్స్ మధ్య క్వాలిఫయర్ 1 మ్యాచ్ జరిగింది. సూపర్ ఓవర్కు దారితీసిన మ్యాచ్లో కరాచీ కింగ్స్ విజయం సాధించి ఫైనల్కు చేరింది. ఆద్యాంతం థ్రిల్లర్ సినిమాను తలపించిన ఈ మ్యాచ్లో ఓ సరదా సన్నివేశం చోటు చేసుకుంది.
ఊహించని అతిథి మైదానంలోకి రావడంతో మ్యాచ్కు అంతరాయం కలిగింది. కరాచీ కింగ్స్ ఇన్నింగ్స్ 14 ఓవర్ సందర్బంగా మ్యాచ్ ఆగిపోయింది. దాంతో అసలేం జరుగుతుందో అనేది అటు అభిమానులకు ఇటు ప్రేక్షకులకు ఏమాత్రం అంతు పట్టలేదు. ఇక టీవీ కెమెరాలు మైదానంలోకి వచ్చిన అతిథిని చూపించడంతో అందరూ నవ్వు ఆపుకోలేకపోయారు. ఓ శునకం మ్యాచ్ జరుగుతుండగా మైదానం మధ్యలోకి వచ్చి మరీ హాయిగా కూర్చుంది. దాంతో ఉలిక్కపడ్డ గ్రౌండ్ సిబ్బంది ఆ శునకాన్ని బయటకి పంపించేశారు. ఆ తర్వాత మ్యాచ్ రీస్టార్ట్ అయింది. ఇక ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి.
ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ముల్తాన్ సుల్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 141 రన్స్ చేసింది. రవి బోపారా(40), సోహైల్ తన్వీర్(21) టాప్ స్కోరర్లుగా నిలిచారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన కరాచీ కింగ్స్ కూడా నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 141 రన్సే చేయడంతో మ్యాచ్ టై అయి సూపర్ ఓవర్కు దారి తీసింది. సూపర్ ఓవర్లో కరాచీ కింగ్స్ 2 వికెట్లకు 13 రన్స్ చేయగా.. ముల్తాన్ సుల్తాన్ 9 పరుగులే చేసి ఓటమిపాలైంది.