సౌతాఫ్రికా పర్యటనను విజయంతో ముగించిన టీమిండియా.. సొంతగడ్డపై అఫ్గానిస్థాన్తో మూడు టీ20ల సిరీస్ ఆడనుంది. జనవరి 11 నుంచి 17 వరకు జరిగే ఈ సిరీస్ కోసం భారత సెలెక్షన్ కమిటీ జట్టును ఎంపిక చేయాల్సి ఉంది. సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టీ20ల్లోకి రీఎంట్రీ ఇస్తారా? అనే సందేహం నెలకొంది. ఇప్పటికే ఈ విషయంపై సెలెక్టర్లు ఈ సీనియర్ ప్లేయర్లతో చర్చించినట్లు తెలుస్తోంది.
ఈ ఏడాది ఐపీఎల్ ముగిసిన వెంటనే టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో రోహిత్ శర్మ, కోహ్లీలకు అవకాశం ఇవ్వాలని మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు. వన్డే ప్రపంచకప్లో గాయపడిన హార్దిక్ పాండ్యా ఈ సిరీస్తో రీఎంట్రీ ఇస్తాడా? లేదా? అనేదానిపై కూడా సందేహం నెలకొంది. చీలమండకు గాయమైన నేపథ్యంలో అతను పూర్తి ఫిట్నెస్ సాధించేవరకు రెస్ట్ ఇచ్చే అవకాశం ఉంది.

సౌతాఫ్రికా పర్యటనలో గాయపడ్డ సూర్యకుమార్ యాదవ్ కూడా ఈ సిరీస్కు దూరం కానున్నాడు. మానసిక సమస్యలతో బాధపడుతున్నానని సౌతాఫ్రికా పర్యటన నుంచి స్వదేశానికి తిరిగి వచ్చిన ఇషాన్ కిషన్ ఆడటంపై కూడా సందేహాలు నెలకొన్నాయి. గత ఏడాదిగా టీ20లకు దూరంగా ఉన్న కేఎల్ రాహుల్ కూడా అఫ్గాన్తో సిరీస్కు దూరంగా ఉండనున్నాడు.
అజిత్ అగార్కర్ సారథ్యంలోని భారత సెలెక్షన్ కమిటీ శుక్రవారం రాత్రిలోపు అఫ్గాన్తో టీ20 సిరీస్ ఆడే భారత జట్టును ఎంపిక చేసే అవకాశం ఉంది. 15 మంది సభ్యులతో కూడిన ఈ జట్టులో రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీకి చోటు దక్కనుంది. ఈ ఇద్దరు చివరిసారిగా ఆస్ట్రేలియా వేదికగా ఇంగ్లండ్తో జరిగిన టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్లో చివరిసారిగా ఆడారు.
అఫ్గానిస్థాన్ అని లైట్ తీసుకుంటే మాత్రం రోహిత్, కోహ్లీతో పాటు సీనియర్ ఆటగాళ్లంతా దూరంగా ఉండే అవకాశం ఉంది.
అఫ్గాన్తో టీ20 సిరీస్కు ఎంపికయ్యే భారత జట్టు(అంచనా)
రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేశ్ శర్మ, సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, శివమ్ దూబే, రవి బిష్ణో, అర్ష్దీప్ సింగ్, ప్రసిధ్ కృష్ణ, ఆవేశ్ ఖాన్, ముఖేష్ కుమార్