హైదరాబాద్: టీమిండియా యువ బ్యాటర్ పృథ్వీ షా తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. 23 ఏళ్ల వయసులోనే ఎన్నో కష్టాలను ఎదుర్కొన్న పృథ్వీ షా తాను నేర్చుకున్న జీవిత సత్యాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. సక్సెస్ సాధించినప్పుడు పలకరించే జనాలు.. కష్టాల్లో ఉంటే కనబడరని, దారిదాపుల్లోకి కూడా రారని పేర్కొన్నాడు.
'జీవితంలో మనం ఎదుగుతున్నప్పుడు చేతులు అందించేవారు.. పడిపోతుంటే మాత్రం దగ్గరకు కూడా రారు. ఒక్కరు కూడా మనల్ని పట్టించుకోరు.'అనే సందేశాత్మక కామెంట్తో తన గాయానికి సంబంధించిన ఫొటోను పృథ్వీ షా షేర్ చేశాడు.

గత 6 నెలలుగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న పృథ్వీ షా.. ఇంగ్లండ్ దేశవాళీ టోర్నీ రాయల్ వన్డే కప్లో దుమ్ము రేపాడు. ఓ విధ్వంసకర డబుల్ సెంచరీతో పాటు సెంచరీ బాది తాను ఎంతటి ప్రమాదకర ఆటగాడినో ప్రపంచానికి మరోసారి గుర్తు చేశాడు. కానీ దురదృష్టవశాత్తు మళ్లీ గాయపడి ఆటకు దూరమయ్యాడు.
సూపర్ ఫామ్ అందుకున్న వెంటనే గాయపడటం అతనికి తీవ్ర నష్టం చేసింది. టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వాలనే అతని ఆశలకు ఈ గాయం గండికొట్టింది. ఫీల్డింగ్ చేస్తుండగా పృథ్వీ షా మోకాలికి గాయమైంది. ప్రస్తుతం బీసీసీఐ పర్యవేక్షణలో అతను శిక్షణ తీసుకుంటున్నాడు. అతను పూర్తిగా కోలుకోవడానికి సుమారు రెండు నెలల సమయం పట్టనుంది.
రాయల్ వన్డేకప్లో నార్తంప్టన్షైర్ తరఫున నాలుగు ఇన్నింగ్స్లు ఆడిన పృథ్వీ షా 429 పరుగులు చేశాడు. గతేడాది రంజీ ట్రోఫీలోనూ పృథ్వీ షా సత్తా చాటాడు. 6 మ్యాచ్ల్లో 595 పరుగులు చేశాడు. ఈ ప్రదర్శనతో న్యూజిలాండ్తో టీ20 సిరీస్కు ఎంపికైనా అతనికి తుది జట్టులో చోటు దక్కలేదు. ఆ తర్వాత జరిగిన ఐపీఎల్లో అతను దారుణంగా విఫలమయ్యాడు.

దాంతో సెలెక్టర్లు పృథ్వీ షాను పట్టించుకోలేదు. ఈ క్రమంలోనే తీవ్ర మానసిక సమస్యలను ఎదుర్కొన్న పృథ్వీ షా ఫిట్నెస్ కోల్పోయి బరువెక్కాడు. రాయల్ వన్డే కప్ బరిలోకి దిగి రాణించినా.. దురదృష్టం వెంటాడటంతో మళ్లీ గాయపడి మంచానికే పరిమితమయ్యాడు. పృథ్వీ షా షేర్ చేసిన క్రిప్టిక్ పోస్ట్పై నెటిజన్లు సానుకూలంగా స్పందిస్తున్నారు.
'జీవిత సత్యం చెప్పినవ్ తమ్మీ'అని ఒకరంటే.. బెల్లం ఉంటేనే ఈగలు ఉంటాయనే సామెతకు పృథ్వీ షా కొటేషన్ సరిపోతుందని మరికొందరు కామెంట్ చేశారు.