టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వడంపై తాను ఆలోచించడం లేదని, ఆటను ఆస్వాదించడంపై మాత్రమే ఫోకస్ పెట్టానని యువ ఓపెనర్ పృథ్వీ షా తెలిపాడు. మోకాలి గాయంతో గత 6 నెలలుగా ఆటకు దూరమైన పృథ్వీ షా.. ఈ సీజన్ రంజీ ట్రోఫీతో మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టాడు. ఛత్తీస్గఢ్తో జరుగుతున్న మ్యాచ్లో ముంబై తరఫున 107 బంతుల్లోనే శతకం సాధించిన పృథ్వీ షా తన పునరాగమనాన్ని ఘనంగా చాటుకున్నాడు.
ఓవరాల్గా 185 బంతులు ఆడి 18 ఫోర్లు, మూడు సిక్సర్లతో 159 పరుగులు చేశాడు. ఈ అసాధారణ ఇన్నింగ్స్తో అరుదైన ఘనతను అందుకున్నాడు. రంజీ ట్రోఫీ చరిత్రలో తొలి రోజు ఆట ఫస్ట్ సెషన్లోనే రెండు సెంచరీలు నమోదు చేసిన తొలి భారత ఆటగాడిగా చరిత్రకెక్కాడు. ఈ సంచలన రికార్డు నేపథ్యంలో ఓ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పృథ్వీ షా తన రీఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వడంపై తాను ఆలోచించడం లేదని చెప్పాడు. గతం, భవిష్యత్తు గురించి ఆలోచించకుండా ప్రస్తుత కాలంలో ఉంటూ ఆటను ఆస్వాదించాలనుకుంటున్నానని స్పష్టం చేశాడు. 'భవిష్యత్తు గురించి నేను ఆలోచించడం లేదు. ప్రస్తుత కాలంలో ఉంటూ ఆటను ఆస్వాదించాలనుకుంటున్నా.
టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వాలనే ఆశ కూడా లేదు. మళ్లీ ఆడటం మొదలుపెట్టినందుకు ఎంతో సంతోషంగా ఫీలవుతున్నా. ఇప్పుడే గాయం నుంచి కోలుకొని బ్యాట్ పట్టాను. నా బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నాను. ప్రస్తుతం నా లక్ష్యం ముంబై తరఫున రంజీ ట్రోఫీ గెలవడమే. ఈ టైటిల్ గెలిచేందుకు నా వంతు సహకారం అందించేందుకు ప్రయత్నిస్తున్నాను.
గాయం తర్వాత రీఎంట్రీ ఇస్తానా? లేదా? అనే భయం నన్ను వెంటాడింది. మైదానంలో అడుగుపెట్టినప్పుడు నేను నా శైలిలో బ్యాటింగ్ చేయగలనా? లేదా? అనే సందేహం కలిగింది. నేను ఎలా ఆడతాను. ఎప్పుడు రీఎంట్రీ ఇస్తాను. మునపటిలా పరుగులు చేయగలనా? అనే సందేహాలు నన్ను వెంటాడాయి. కానీ మైదానంలో కాసేపు గడిపాక పరిస్థితులన్నీ సాధారణమే అనిపించాయి.నేనేం భయపడలేదు. కానీ రీఎంట్రీలో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు విచిత్రమైన ఫీలింగ్ కలిగింది. అంతా మంచే జరుగుతుందని నాకు నేను చెప్పుకున్నాను. నా బాడీ లాంగ్వేజ్ కూడా బాగానే ఉంది.'అని పృథ్వీ షా చెప్పుకొచ్చాడు.
రాయల్ వన్డే కప్లో నార్తంప్టన్షైర్ తరఫున శతకాల మోత మోగించిన పృథ్వీ షా.. ఓ డబుల్ సెంచరీతో పాటు విధ్వంసకర సెంచరీ బాదీ అందరి దృష్టిని ఆకర్షించాడు. అంతలోనే ఫీల్డింగ్ చేస్తూ తీవ్రంగా గాయపడ్డాడు. మోకాలికి తీవ్ర గాయం కావడంతో గత 6 నెలలుగా మైదానానికి దూరమయ్యాడు. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో చికిత్స తీసుకున్న పృథ్వీ షా.. తీవ్రంగా శ్రమించి పూర్తి ఫిట్నెస్ సాధించి మళ్లీ ఆడటం మొదలుపెట్టాడు.