తన స్నేహితుల్లోని కొందరి వల్ల తన కెరీర్ నాశనమైందని టీమిండియా యువ బ్యాటర్ పృథ్వీ షా తెలిపాడు. తన స్వయంకృపరాధంతోనే ఇలాంటి పరిస్థితి తలెత్తిందని చెప్పాడు. గత రెండేళ్లుగా తాను క్రికెట్కు ఎక్కువ టైమ్ ఇవ్వలేదని తన తప్పిదాన్ని పృథ్వీ షా అంగీకరించాడు. పేలవ ఫామ్, ఫిట్నెస్ సమస్యలతో ప్రొఫెషనల్ క్రికెట్కు దూరమైన పృథ్వీ షా.. ఐపీఎల్ 2025 సీజన్ మెగా వేలంలో అన్సోల్డ్గా నిలిచాడు. 25 ఏళ్లకే పొట్ట, బట్ట తలతో అంకుల్లా మారిన పృథ్వీ షాను తీసుకునేందుకు ఫ్రాంచైజీలు పెద్దగా ఆసక్తి చూపలేదు.
2018 అండర్ 19 ప్రపంచకప్ విజయంతో భారత జట్టులోకి తారా జువ్వలా దూసుకొచ్చిన పృథ్వీ షా అంతే వేగంగా జట్టుకు దూరమయ్యాడు. మరో కోహ్లీ అవుతాడని విమర్శకుల ప్రశంసలు అందుకున్న పృథ్వీ షా.. ప్రస్తుతం ఐపీఎల్ కూడా ఆడటం లేదు. తన సారథ్యంలో అండర్ 19 ప్రపంచకప్ ఆడిన శుభ్మన్ గిల్.. టీమిండియా టెస్ట్ కెప్టెన్గా ఎదిగాడు. అర్ష్దీప్ సింగ్ ప్రధాన పేసర్గా మారాడు. కానీ పృథ్వీ షా.. చిన్న వయసులోనే వచ్చిన డబ్బుతో ఆటను పక్కనపెట్టాడు. గాయాలు, ఫిట్నెస్ సమస్యలతో పాటు క్రమశిక్షణ లేమితో ఆటకు దూరమయ్యాడు.

మళ్లీ ప్రొఫెషనల్ క్రికెట్లో రీఎంట్రీ ఇచ్చేందుకు పృథ్వీ షా కీలక నిర్ణయం తీసుకున్నాడు. దేశవాళీ క్రికెట్లో ముంబై జట్టును వీడాలని నిర్ణయించుకున్నాడు. అప్కమింగ్ దేశవాళీ సీజన్లో మరో జట్టు తరఫున బరిలోకి దిగాలని భావిస్తున్నాడు. ఇప్పటికే అతను ముంబై క్రికెట్ అసోసియేషన్ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్(ఎన్ఓసీ)ని కోరినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా ఓ జాతీయ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పృథ్వీ షా ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.
ముంబై క్రికెట్ అసోసియేషన్(ఎంసీఏ)ను ఎన్ఓసీ కోరినట్లు ధృవీకరించాడు. ఎంఎస్ఏకు రాసిన లేఖలో తనకు అవకాశాలు ఇచ్చిన ప్రోత్సహించినందుకు కృతజ్ఞతలు చెప్పినట్లు కూడా పృథ్వీ షా వెల్లడించాడు.ఇప్పటికే తనను రెండు, మూడు రాష్ట్రాల క్రికెట్ అసోసియేషన్స్ సంప్రదించాయని తెలిపాడు. త్వరలోనే ఏ జట్టుకు ఆడాలనేది నిర్ణయించుకుంటానని చెప్పాడు. ఫిట్నెస్ సాధించి టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వడమే తన లక్ష్యమని చెప్పుకొచ్చాడు. దేశవాళీ క్రికెట్ సందర్భంగా రోహిత్ శర్మను కలిసానని, రీఎంట్రీ ఎలా ఇవ్వాలనే విషయంపై సలహాలు ఇచ్చాడని పృథ్వీ షా తెలిపాడు.
'గత రెండేళ్లుగా నేను చాలా తప్పులు చేశాను. క్రికెట్కు సమయాన్ని కేటాయించడం ఆపేసాను. కొందరు స్నేహితులు క్రికెట్ నుంచి నా దృష్టిని మరల్చారు.'అని పృథ్వీ షా తెలిపాడు.