లండన్: టీమిండియా సెలెక్షన్ గురించి తాను ఏ మాత్రం ఆలోచించడం లేదని యువ బ్యాటర్, డాషింగ్ ఓపెనర్ పృథ్వీ షా అన్నాడు. తన ఆటను ఆస్వాదించడంపై మాత్రమే ఫోకస్ పెట్టానని స్పష్టం చేశాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ దేశవాళీ క్రికెట్ ఆడుతున్న పృథ్వీ షా.. డొమెస్టిక్ వన్డే కప్ 2023 టోర్నీలో విధ్వంసకర డబుల్ సెంచరీతో చెలరేగాడు.
129 బంతుల్లో 24 ఫోర్లు, 8 సిక్స్లతో ద్విశతకం అందుకొని లిస్ట్ ఏ క్రికెట్లో పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. ఈ టోర్నీలో నార్తాంప్టన్ షైర్ టీమ్కు ప్రాతినిథ్యం వహిస్తున్న పృథ్వీ షా.. బుధవారం సోమర్సెట్తో జరిగిన మ్యాచ్లో 153 బంతుల్లో 244 పరుగులు చేశాడు. పృథ్వీ షా ఇన్నింగ్స్లో 28 ఫోర్లు, 11 సిక్స్లతో మొత్తం 39 బౌండరీలు ఉండటం విశేషం.

ఈ విధ్వంసకర ఇన్నింగ్స్తో నార్తాంప్టన్షైర్ 87 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్ అనంతరం తన ఇన్నింగ్స్పై మాట్లాడిన పృథ్వీ షా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'భారత సెలెక్టర్లు నా గురించి ఏం అనుకుంటున్నారని అస్సలు ఆలోచించడం లేదు. నా ఆటను ఆస్వాదించడంపై మాత్రమే ఫోకస్ పెట్టాను.
ఇక్కడి ఆటగాళ్లు, సహాయక బృందంతో చక్కటి సమయం గడుపుతున్నాను. నార్తంప్టన్షైర్ నాకు ఈ అవకాశం ఇచ్చింది. వారు నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు. నేను ఆటను ఆస్వాదిస్తున్నాను. నా అత్యధిక స్కోర్ 227. దాన్ని అధిగమించాలనుకున్నా. ఇదే నా సహచర బ్యాటర్ వైటీకి తెలియజేశాను.
ఇది సమష్టి ప్రదర్శన. జట్టు విజయం కోసం మాత్రమే నేను ప్రయత్నిస్తా. వ్యక్తిగత ప్రదర్శనల కన్నా జట్టుకు తొలి ప్రాధాన్యత ఇచ్చే ఆటగాడిని నేను. ఇలా నేను పరుగులు చేస్తే నా జట్టు ఈజీగా గెలుస్తోంది. ఈ జోరును ఇలానే కొనసాగించాల్సిన అవసరం ఉంది.
వాతావరణం కూడా భారత్లో వలే ఎండగా ఉంది. ఈ రోజు నా పూర్తి సామర్థ్యాలను బయటకు తెచ్చి ఆడాను. ఈ రోజు నాకు బాగా కలిసొచ్చింది. ఇక నేను వెనుదిరిగి చూసుకోను.' అని పృథ్వీ షా చెప్పుకొచ్చాడు. ఈ మ్యాచ్కు ముందు క్రిక్ బజ్కు ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ పృథ్వీ షా కీలక వ్యాఖ్యలు చేశాడు.
'కారణం చెప్పకుండా పక్కనపెట్టారు. కొందరేమో ఫిట్నెస్ లేకపోవడంతోనే వేటు వేసారని తెలిపారు. దాంతో నేను ఎన్సీఏలో ఫిట్నెస్ టెస్ట్ క్లియర్ చేసి.. దేశవాళీ క్రికెట్లో పరుగులు చేసి టీ20 టీమ్లోకి రీఎంట్రీ ఇచ్చాను. కానీ వెస్టిండీస్ పర్యటనకు నన్ను ఎంపిక చేయలేదు. ఇది నన్ను తీవ్రంగా నిరాశపరిచింది.
నా కలను నెరవేర్చుకునేందుకే కష్టపడుతున్నా. భారత్ తరఫున 12-14 ఏళ్లు ఆడాలనుకుంటున్నా. భారత్కు ప్రపంచకప్ అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నా. నా జీవితంలో ఈ లక్ష్యాలను అందుకోవాలి. దాని కోసం మరింత కష్టపడటంతో పాటు పరుగులు చేయడంపై ఫోకస్ పెట్టాను.'అని పృథ్వీ షా చెప్పుకొచ్చాడు.