లింకన్(న్యూజిలాండ్): గాయం.. ఆ తర్వాత నిషేధం.. అనంతరం అద్భుత డబుల్ సెంచరీతో రంజీలో రీ ఎంట్రీ.. మళ్లీ అంతలోనే గాయం.. ఇలా ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్న ఇండియా యువ సంచలనం పృథ్వీషా తన పునరాగమనాన్ని ఘనంగా చాటుకుంటున్నాడు. ఇటీవలే నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ) రిహాబిలిటేషన్ను పూర్తిచేసుకొని ఇండియా-ఏ న్యూజిలాండ్ టూర్కు వెళ్లిన ఈ ముంబై సంచలనం ప్రాక్టీస్ మ్యాచ్లో 150 రన్స్తో చెలరేగి టీమిండియా సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు.
సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ గాయపడటంతో అతని స్థానంలో వన్డేజట్టుకు ఎంపికయ్యాడు. ఈ ఆనందంలో ఈ యువ బ్యాట్స్మన్ మరింత చేలరేగుతున్నాడు. న్యూజిలాండ్-ఎతో మూడు వన్డేల సిరీస్లో భాగంగా మంగళవారం జరిగిన మ్యాచ్లో పృథ్వీషా(35 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 48) అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఈ యువ క్రికెటర్కు తోడు ధావన్ ప్లేస్లోనే టీ20 జట్టులో చోటుదక్కించుకున్న కేరళ బ్యాట్స్మన్ సంజూశాంసన్ (21 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 39) కూడా ఆకట్టుకున్నాడు.
ఈ ఇద్దరి మెరుపులకు తోడు ఇతర ఆటగాళ్లు సమష్టిగా రాణించడంతో న్యూజిలాండ్-ఎతో జరిగిన అనధికారిక తొలి వన్డేలో భారత్ 5 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్లో శుభ్మన్గిల్ నేతృత్వంలోని భారత్ 1-0తో లీడ్లో నిలిచింది.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆతిథ్య-ఎ జట్టు 48.3 ఓవర్లలో 230 రన్స్కు ఆలౌటైంది. రచిన్ రవీంద్ర(49), టామ్ బ్రూస్(47) టాప్స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో మహ్మద్ సిరాజ్ (3/33) మూడు వికెట్లతో చెలరేగగా.. అహ్మద్, పటేల్ రెండేసి వికెట్లు పడగొట్టారు. విజయ్ శంకర్, రాహుల్ చహర్కు తలో వికెట్ దక్కింది. అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన భారత్కు పృథ్వీ షా అదిరే ఆరంభాన్నిచ్చాడు. అతను ఔటైనా మిగితా బ్యాట్స్మన్ శుభ్మన్ గిల్ (30),శాంసన్, సూర్యకుమార్ యాదవ్ (35), విజయ్ శంకర్(20 నాటౌట్) తలో చేయివేయడంతో 29.3 ఓవర్లలో 5 వికెట్లకు 231 పరుగులు చేసిన భారత్ 123 బంతులు మిగిలుండగానే సునాయస విజయాన్నందుకుంది. ప్రత్యర్థి బౌలర్లలో జేమ్స్ నీషమ్ రెండు వికెట్లు తీయగా.. అజాజ్ పటేల్, టాడ్ యాస్ట్లి, రచిన్ రవీంద్ర తలో వికెట్ తీశారు.
రెండో వన్డే క్రిస్ట్ చర్చ్ వేదికగా శుక్రవారం జరగనుండగా.. మూడో వన్డే ఇదే వేదికగా ఆదివారం జరగనుంది. మొత్తానికి మెగా సిరీస్కు మందు పృథ్వీ షా, శాంసన్లకు మంచి ప్రాక్టీస్ లభిస్తోంది.