
అద్దం ముందు నిల్చొని:
ప్రస్తుతం జరుగుతున్న దేశవాళీ ప్రతిష్టాత్మక వన్డే క్రికెట్ టోర్నీ విజయ్హజారె ట్రోఫీలో అత్యధికంగా 754 పరుగులు చేసిన పృథ్వీ షా తాజాగా ఓ జాతీయ మీడియాతో మాట్లాడాడు. ఆస్ట్రేలియా పర్యటన పరిస్థితులను ఎలా ఎదుర్కొన్నారని ప్రశ్నించగా... 'ఆ సమయంలో నేను చాలా ఆందోళనకు గురయ్యా. ఏం జరుగుతోందని నన్ను నేను ప్రశ్నించుకున్నా. నా బ్యాటింగ్లో లోపాలుంటే.. అవేంటని ఆలోచించా. ఇక డేనైట్ టెస్టులో ప్రపంచంలోనే మేటి జట్టుతో ఆడానని నాకు నేను సర్దిచెప్పుకున్నా. ఆ మ్యాచ్లో నేనెందుకు బౌల్డ్ అయ్యానని ఎన్నోసార్లు ప్రశ్నించుకున్నా. అద్దం ముందు నిల్చొని.. అందరూ అనుకున్నంత చెత్త ఆటగాడిని మాత్రం కాదని భావించా' అని తెలిపాడు.

గదిలోకెళ్లి ఏడ్చేశా:
'ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్లో భారత జట్టు గెలిచినందుకు సంతోషంగా ఉన్నా.. నన్ను పక్కనపెట్టడంతో ఆందోళన చెందా. అదే నా జీవితంలో అత్యంత బాధాకరమైన రోజు. ఆరోజు గదిలోకెళ్లి ఒక్కసారిగా ఏడ్చేశాను. ఏదో జరుగుతుందని అనిపించింది. కొన్ని రోజుల తర్వాత మనసు కుదుటపడింది. విజయ్హజారె ట్రోఫీలో రాణించడం బాగుంది. త్వరలోనే టీమిండియాకు ఆడుతానన్న నమ్మకం ఉంది' అని యువ ఓపెనర్ పృథ్వీ షా ధీమా వ్యక్తం చేశాడు. రోహిత్ శర్మ రావడం, గిల్ రాణించడంతో.. ఆసీస్ పర్యటనలో షా, మయాంక్ రిజర్వ్ బెంచ్కే పరిమితమయ్యారు. ఆ తడబాటు కారణంగా షా ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్ కూడా ఆడలేదు.

విజయ్హజారె ట్రోఫీలో రెచ్చిపోతున్న షా:
ప్రస్తుతం విజయ్హజారె ట్రోఫీలో ఆడుతున్న పృథ్వీ షా.. ముంబై కెప్టెన్గా రెచ్చిపోతున్నాడు. మూడు భారీ సెంచరీలతో పాటు ఒక ద్విశతకం సాధించి టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. దాంతో మూడేళ్ల క్రితం ఇదే టోర్నీలో కర్ణాటక బ్యాట్స్మన్గా మయాంక్ అగర్వాల్ సాధించిన 723 అత్యధిక పరుగుల రికార్డును అధిగమించాడు. ఈ సీజన్లో ముంబై గురువారం కర్ణాటక జట్టును ఓడించడంతో ఫైనల్కు చేరింది. ఆదివారం ఉత్తర్ప్రదేశ్తో ఫైనల్లో తలపడనుంది. షా మరోసారి చెలరేగితే ముంబైకి సునాయాస విజయం దక్కుతుంది.

శాంసన్ రికార్డు బద్దలు:
ఇటీవల పుదుచ్చేరితో జరిగిన మ్యాచ్లో షా డబుల్ సెంచరీతో సత్తా చాటాడు. 152 బంతుల్లో 31 ఫోర్లు, 5 సిక్సర్లతో 227 పరుగులతో అజేయంగా నిలిచిన షా.. నయా రికార్డు నెలకొల్పాడు. సంజూ శాంసన్ (212) పేరిట ఉన్న అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డును అధిగమించాడు. అంతేగాక లిస్టు ఏ క్రికెట్(పురుషుల)లో ఈ ఫీట్ సాధించిన తొలి కెప్టెన్గా కూడా నిలిచాడు. శ్రేయస్ అయ్యర్ గైర్హాజరీలో షా ముంబై జట్టు పగ్గాలు చేపట్టిన విషయం తెలిసిందే. ఇక విజయ్ హజారే ట్రోఫీ చరిత్రలో ఇంతకు ముందు సచిన్ టెండుల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, రోహిత్ శర్మ, కేవీ కౌశల్, యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్ ద్విశతకం సాధించారు.
India vs England: శుభవార్త.. తొలి టీ20లో ప్రేక్షకులకు అనుమతి!!


Click it and Unblock the Notifications












