
నమ్మించి మోసం చేశారు..
దాంతో చిర్రెత్తుకుపోయిన పృథ్వీ షా.. ఇన్స్టాగ్రామ్ వేదికగా పరోక్ష వ్యాఖ్యలతో సెలెక్టర్లపై తన ఆగ్రహాన్ని వెళ్లగక్కాడు. 'వాళ్ల మాటలను అస్సలు నమ్మొద్దు. వారి చర్యలను మాత్రమే నమ్మండి. ఎందుకంటే వాళ్లు మాట్లాడే మాటలు అర్థరహితమైనవని వారి చర్యలు నిరూపిస్తాయి.'అని ఉన్న కొటేషన్ను షేర్ చేశాడు. ఇందులో షా ఎవరిని టార్గెట్ చేసుకుని ఈ పోస్ట్ పెట్టాడనే విషయం స్పష్టంగా చెప్పనప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం అతను బీసీసీఐ, సెలక్టర్లను లక్ష్యంగా చేసుకున్నాడనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

19 ఏళ్ల వయసులోనే..
వాస్తవానికి అండర్ 19 ప్రపంచకప్ టైటిల్తో భారత క్రికెట్లోకి దూసుకొచ్చిన పృథ్వీ షాకు కెరీర్ ఆరంభంలో బీసీసీఐ చాలా ప్రాధాన్యత ఇచ్చింది. 19 ఏళ్ల వయసులోనే ఇంగ్లండ్ పర్యటనకు ఎంపిక చేసింది. ఆ పర్యటనలో తుది జట్టులో ఆడే అవకాశం రాకున్నా..వెస్టిండీస్తో సొంతగడ్డపై జరిగిన టెస్ట్ సిరీస్లో రాజ్కోట్ వేదికగా జరిగిన మ్యాచ్తో షా అరంగేట్రం చేశాడు. ఫస్ట్ మ్యాచ్లోనే సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన షా.. కాలిగాయంతో జట్టుకు దూరమయ్యాడు. అప్పటి నుంచి మళ్లీ అవకాశం అందుకోలేకపోయాడు.

దేశవాళీలో రాణిస్తున్నా..
సెహ్వాగ్ శైలిలో ఆడే షా.. జట్టులో మరో సెహ్వాగ్ అవుతాడని అంతా భావించారు. కానీ జట్టులో నెలకొన్న తీవ్ర పోటీ నేపథ్యంలో షా వెనకబడిపోయాడు. అయితే దేశవాళీ క్రికెట్లో షా నిలకడగా రాణిస్తున్నా.. సెలెక్టర్లు పట్టించుకోవడం లేదు. ఇటీవలే ముగిసిన దులీప్ ట్రోఫీలో రెండు మ్యాచ్ల్లో కలిపి 105 సగటుతో 315 పరుగులు చేశాడు. అంతకుముందు రంజీ సీజన్లో కూడా రాణించాడు. ఇంత చేసినా సెలక్టర్లు అతన్ని ఇటీవల న్యూజిలాండ్ ఏ సిరీస్ తో పాటు తాజాగా సౌతాఫ్రికా సిరీస్లో కూడా ఎంపిక చేయలేదు.

తిక్కలేస్తే..
అయితే దేశవాళీలో రాణిస్తే జాతీయ జట్టులోకి జై షాను ఎంపిక చేస్తారని అతనికి సెలక్టర్లలో ఎవరైనా హామీ ఇచ్చి తర్వాత మాట తప్పడంతోనే షా ఇలా ఆగ్రహంగా ఉన్నాడని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. షా ఇలా క్రిప్టిక్ పోస్టులు చేయడం ఇదేం కొత్త కాదు. గతంలో ఐపీఎల్ ముగిసిన తర్వాత సౌతాఫ్రికా, ఐర్లాండ్ సిరీస్లో అతన్ని ఎంపిక చేయకపోవడంపై స్పందిస్తూ.. 'ఎప్పుడూ నమ్మకాన్ని వదులుకోకండి.. అద్భుతాలు మీ మార్గంలోనే ఉన్నాయి' అని షిర్డీ సాయిబాబా ఉన్న ఫోటోను జతచేసి పోస్ట్ చేశాడు. అయితే షాను ఇలానే విస్మరిస్తే.. ఉన్ముక్త్ చంద్లా భారత క్రికెట్కు గుడ్ బై చెప్పి ఇంటర్నేషనల్ లీగ్స్ ఆడుతాడని ఫ్యాన్స్ బీసీసీఐని హెచ్చరిస్తున్నారు.


Click it and Unblock the Notifications












