ఐపీఎల్ 2025 మెగా వేలంలో అన్సోల్డ్గా నిలిచిన టీమిండియా యువ బ్యాటర్ పృథ్వీ షా.. తనపై జరుగుతున్న ట్రోలింగ్పై స్పందించాడు. తానేం తప్పు చేశానని ట్రోలింగ్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. సోషల్ మీడియాలో తనను ఫాలో కానీ వారే ఎక్కువగా తనను ట్రోల్ చేస్తారని తెలిపాడు. తనపై వచ్చిన ట్రోలింగ్ను కొన్నిసార్లు సరదాగా తీసుకున్నా.. మరికొన్ని సార్లు మాత్రం తీవ్రంగా బాధపడ్డానని చెప్పాడు.
ముఖ్యంగా తనపై వచ్చే మీమ్స్ బాధపెట్టాయని గుర్తు చేసుకున్నాడు. ఐపీఎల్ 2025 మెగావేలంలో రూ. 75 లక్షల కనీస ధరతో అందుబాటులో ఉన్న పృథ్వీ షాను ఫ్రాంచైజీలు పట్టించుకోలేదు. అధిక బరువు, ఫిట్నెస్ సమస్యలతో పాటు నిలకడలేమి ఆట, సరైన క్రమ శిక్షణ లేదనే కారణాలతో ఫ్రాంచైజీలు పృథ్వీ షాను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపలేదు. ఈ క్రమంలోనే పృథ్వీ షాకు సంబంధించిన ఓ పాత వీడియో నెట్టింట వైరల్గా మారింది.

'సోషల్ మీడియాలో నన్ను ఫాలో కానీ వారు కూడా ట్రోల్ చేస్తున్నారు. అంటే వాళ్లు నాపై ఓ కన్నేసి ఉంచారని అర్థం. ట్రోలింగ్ అనేది మంచిది కాదనేది నా అభిప్రాయం. అలాగని చెడ్దది కూడా కాదు. నాపై వచ్చే మీమ్స్ నేను చూస్తుంటాను. కొన్నిసార్లు బాధపడేలా అవి ఉంటాయి. నా బర్త్డే సందర్భంగా నేను చేసిన డ్యాన్స్పై కూడా ట్రోల్ చేశారు.
అసలు నేను చేసిన తప్పిదం ఏంటో నాకు అర్థం కాలేదు. నేను ఏదైనా తప్పు చేస్తే విమర్చించాలి. కానీ ఏ తప్పు చేయనప్పుడు కూడా ట్రోల్స్ చేయడం సరికాదు.'అని పృథ్వీ షా చెప్పుకొచ్చాడు. 2018లో ఢిల్లీ క్యాపిటల్స్లో చేరిన పృథ్వీ షా.. ఏడేళ్ల పాటు ఆ జట్టులోనే కొనసాగాడు. నిలకడలేమని ప్రదర్శన కనబర్చినా.. ఢిల్లీ క్యాపిటల్స్ అతనికి అండగా నిలిచింది.
నాలుగేళ్ల వయసులోనే తల్లి మరణించడంతో.. తండ్రి చాటున పెరిగిన పృథ్వీ షా.. స్వయంకృపరాధంతో పాటు విధిరాత కూడా కలిసిరాలేదు. 23 ఏళ్ల వయసులోనే పొట్ట, బట్టతో కనిపించి తీవ్ర బాడీషేమింగ్కు గురయ్యాడు. కోచ్ల మాట వినకపోవడం.. సరిగ్గా ప్రాక్టీస్ చేయకపోవడంతో ముంబై జట్టు కూడా అతన్ని రంజీ టీమ్ నుంచి తప్పించింది.
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీతో మళ్లీ ముంబై జట్టులోకి రీఎంట్రీ ఇచ్చినా మునపటిలా ఆకట్టుకోలేకపోయాడు. రంజీ ట్రోఫీలోనూ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. దాంతో ఫ్రాంచైజీలు పృథ్వీ షాను తీసుకునేందుకు ఆసక్తి చూపించలేదు. ప్లేయర్లు తక్కువగా ఉన్న ఫ్రాంచైజీలు కరుణించి తీసుకోవడమో.. లేక గాయపడ్డ ఆటగాళ్ల ప్లేస్లో రిప్లేస్మెంట్ అవుతనో తప్పా పృథ్వీ షా ఐపీఎల్ 2025 ఆడేందుకు ఆస్కారం లేదు.