
న్యూఢిల్లీ: తన పరిస్థితి గురించి తెలియకుండా విమర్శలు చేయవద్దని ఢిల్లీ క్యాపిటల్స్ యువ ఓపెనర్ పృథ్వీ షా విజ్ఞప్తి చేశాడు. బీసీసీఐ నిర్వహించిన ఫిట్నెస్ టెస్ట్లో పృథ్వీ షా విఫలమైన విషయం తెలిసిందే. టీ20 ప్రపంచకప్ ప్రణాళికల్లో ఉన్న ఆటగాళ్లకు బీసీసీఐ.. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ)లో ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించింది. బీసీసీఐ కాంట్రాక్టుల్లో ఉన్న ఆటగాళ్లకు ఈ ఫిట్నెస్ టెస్ట్ క్వాలిఫై కావడం తప్పనిసరి చేసింది.
ఇక భారత ఆటగాళ్ల ఫిట్నెస్కు ప్రమాణికంగా భావించే యోయో టెస్ట్ను తాజాగా నిర్వహించగా.. హార్దిక్ పాండ్యా పాస్ మార్క్లతో బయటపడగా.. పృథ్వీ షా విఫలమయ్యాడు. యోయో టెస్ట్లో నిర్దేశించిన కనీస స్కోర్ 16.5ను పొందడంలో హార్ధిక్ పాండ్యా సాధించగా, ఢిల్లీ ఓపెనర్ చేతులెత్తేశాడు. అయితే పృథ్వీ షా బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్లో లేకపోవడంతో అతనికి ఐపీఎల్ ఆడేందుకు అనుమతి లభించింది. యోయో టెస్ట్లో షా 15 కంటే తక్కువ స్కోర్ చేసినట్లు, హార్ధిక్ 17కి పైగా స్కోర్ సాధించినట్లు తెలుస్తుంది.
ఇక యోయో టెస్ట్లో విఫలమైన పృథ్వీ షాపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. ఫిట్నెస్పై దృష్టిపెట్టాలని అభిమానులను అతనిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోన తన ఇన్స్టాగ్రామ్ వేదికగా ఓ స్పెషల్ కోట్ను స్టోరీగా షేర్ చేశాడు. తన పరిస్థితి తెలియకుండా ఎవ్వరూ కూడా తన గురించి ఓ నిర్ణయానికి రావద్దన్నాడు. ఎవరు చేసుకున్న కర్మ వాడే అనుభవించాలని పేర్కొన్నాడు. దాంతో పృథ్వీ షా ఏదో బాధలో ఉన్నట్లు అభిమానులు భావిస్తున్నారు. ఇటీవల రంజీ ట్రోఫీలో కూడా పృథ్వీ షా దారుణంగా విఫలమయ్యాడు. మూడు మ్యాచ్లు ఆడిన అతను కేవలం 107 పరగులు మాత్రమే చేశాడు. రంజీ మ్యాచ్లు వల్లే అతను ఫిట్నెస్ టెస్ట్ను క్లియర్ చేయలేదని తెలుస్తోంది.