నేను, నాన్నే బాధ్యులం..
తాజాగా క్రిక్బజ్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ చీకటి రోజులను పృథ్వీషా గుర్తుచేసుకున్నాడు. తాను, తన తండ్రి తెలియక చేసిన తప్పిదంతో ఈ కష్టాలు ఎదురయ్యాయని చెప్పుకొచ్చాడు. 'ఈ ఘటనకు నేను, నా తండ్రే బాధ్యులం. తెలియక చేసిన పనితో ఈ కష్టాలు ఎదుర్కొవాల్సి వచ్చింది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ కోసం ఇండోర్లో ప్రిపేర్ అవుతున్నాం. అప్పుడు నేను జలుబు, దగ్గుతో బాధపడుతున్నా. ఆ రోజు రాత్రి డిన్నర్కు బయట వెళ్లాం. నా తండ్రికి ఫోన్ చేసి మాట్లాడుతుండగా విపరీతంగా దగ్గుతుండటంతో మార్కెట్లో దగ్గు సిరప్ తెచ్చుకో అని చెప్పాడు. నేను డాక్టర్ను కన్సల్ట్ కాకుండా దగ్గు సిరప్ తెచ్చుకొని పెద్ద తప్పు చేశా.
ముఖం ఎలా చూపించాలని..
రెండురోజులకు ఆ సిరప్ తెచ్చుకొని తాగాను. మూడో రోజు డోపింగ్ టెస్టులో పట్టుబడ్డాను.. నిషేధిత డ్రగ్ వాడినందుకు బీసీసీఐ నాపై 8 నెలల నిషేధం విధించింది. అది నా జీవితంలోనే అత్యంత కఠినమైన దశ. దాన్ని నేను మాటల్లో వర్ణించలేను. నా గురించి జనాలు ఎమనుకుంటున్నారు? వారికి నా ముఖం ఎలా చూపించాలనే ఆలోచనలతో కుమిలిపోయాను. నా కెరీర్ ముగిసినట్లేనా? అని ఆందోళన చెందాను. ఆ డిప్రెషన్ నుంచి బయటపడేందుకు లండన్కు వెళ్లాను. అక్కడ కూడా ఇవే ఆలోచనలు నన్ను వెంటాడాయి. ఓ నెలరోజుల పాటు గదిలో నుంచి బయటికి రాలేకపోయాను.'అని పృథ్వీ షా చెప్పుకొచ్చాడు.
బీసీసీఐ ఉదారత..
అయితే పృథ్వీ తాను చేసిన తప్పును బీసీసీఐ ఎదుట నిజాయితీగా ఒప్పుకోవడంతో పాటు తనకు తెలియకుండా నిషేధిత డ్రగ్(టెర్బుటలైన్) వాడినట్లు తేలడంతో అతని పట్ల సానుకూలంగా వ్యవహరించింది. సిరప్ తీసుకున్న కాలం నుంచే నిషేధాన్ని అమలు చేసి కెరీర్ దెబ్బతినకుండా జాగ్రత్త పడింది. దాంతో బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ)లో చేరిన పృథ్వీ షా.. ద్రవిడ్ పర్యవేక్షణలో మరింత రాటు దేలాడు. ఆ తర్వాత ఐపీఎల్ 2020 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున మంచి ప్రదర్శన కనబరిచి ఆసీస్ టూర్కు ఎంపికయ్యాడు. అయితే ఆసీస్తో జరిగిన మొదటి టెస్టులో డకౌట్గా వెనుదిరిగి విమర్శల పాలవడంతో పాటు జట్టులో స్థానం కోల్పోయాడు.
దుమ్మురేపిన షా..
అనంతరం భారత్కు వచ్చిన పృథ్వీషా తన లోపాలను సవరించుకున్నాడు. దేశవాళీ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో దుమ్ము రేపాడు. నాలుగు సెంచరీలతో చెలరేగిన పృథ్వీ ఆ టోర్నీలో 827 పరుగులు చేసి టాపర్గా నిలిచాడు. అదే జోరును ఐపీఎల్ 2021 సీజన్లోను కొనసాగించాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తరపున 8 మ్యాచ్లాడిన షా 308 పరుగులతో జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఐపీఎల్లో ఆకట్టుకున్నా డబ్ల్యూటీసీ ఫైనల్తో పాటు ఇంగ్లండ్తో ఐదు టెస్టుల సిరీస్కు సెలెక్టర్లు పృథ్వీ షాను పరిగణలోకి తీసుకోలేదు. అయితే శ్రీలంక పర్యటనకు వెళ్లే టీమిండియా బీ జట్టుకు అతను ఎంపికయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.