టీమిండియా యువ ఓపెనర్ పృథ్వీ షా.. చరిత్ర సృష్టించాడు. దేశవాళీ ప్రతిష్టాత్మక టోర్నీ రంజీ ట్రోఫీలో ఫస్ట్ సెషన్లో రెండు శతకాలు నమోదు చేసిన తొలి బ్యాటర్గా చరిత్రకెక్కాడు. గాయంతో గత 6 నెలలుగా ఆటకు దూరమైన పృథ్వీ షా.. రీఎంట్రీ ఇచ్చిన రెండో మ్యాచ్లోనే మెరుపు శతకం బాదాడు.
ముంబై జట్టు తరఫున బరిలోకి దిగిన పృథ్వీ షా భారీ శతకం సాధించాడు.
ఛత్తీస్గఢ్తో జరుగుతున్న మ్యాచ్లో 107 బంతుల్లోనే శతకం సాధించాడు. ఓవరాల్గా 185 బంతులు ఆడి 18 ఫోర్లు, మూడు సిక్సర్లతో 159 పరుగులు చేశాడు. తొలి రోజు ఆట లంచ్ సెషన్లోనే రెండు సార్లు శతకం నమోదు చేసిన తొలి బ్యాటర్గా పృథ్వీ షా అరుదైన ఘనతను అందుకున్నాడు.

గతంలో అస్సామ్తో జరిగిన మ్యాచ్లో 383 బంతుల్లో 379 పరుగులు చేసి రంజీ క్రికెట్ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోర్ నమోదు చేసిన రెండో బ్యాటర్గా నిలిచాడు. ఈ మ్యాచ్లోనే తొలి రోజు ఫస్ట్ సెషన్లోనే శతకం పూర్తి చేసుకున్నాడు.
భుపెన్ లాల్వాణి(102)తో కలిసి తొలి వికెట్కు 244 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించాడు. దాంతో ముంబై తొలి ఇన్నింగ్స్లో 351 పరుగులు చేసింది. ముంబై ఓపెనర్లు మినహా మరే బ్యాటర్ రాణించలేదు.
ఆశీష్ చౌహన్(6/105) ఆరు వికెట్లతో సత్తా చాటగా.. రవి కిరణ్(3/53) మూడు వికెట్లు పడగొట్టాడు. విశ్వాస్ మాలిక్(1/44) ఓ వికెట్ తీసాడు. ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్ టోర్నీ రాయల్ లండన్ వన్డే కప్లో తీవ్రంగా గాయపడి ఆటకు దూరమైన పృథ్వీ షా.. పూర్తి ఫిట్నెస్ సాధించి రంజీ ట్రోఫీ 2024లో బెంగాల్తో మ్యాచ్లో రీఎంట్రీ ఇచ్చాడు.
రాయల్ వన్డే కప్లో నార్తంప్టన్షైర్ తరఫున శతకాల మోత మోగించిన పృథ్వీ షా.. ఓ డబుల్ సెంచరీతో పాటు విధ్వంసకర సెంచరీ బాదీ అందరి దృష్టిని ఆకర్షించాడు. అంతలోనే ఫీల్డింగ్ చేస్తూ తీవ్రంగా గాయపడ్డాడు. మోకాలికి తీవ్ర గాయం కావడంతో గత 6 నెలలుగా మైదానానికి దూరమయ్యాడు. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో చికిత్స తీసుకున్న పృథ్వీ షా.. తీవ్రంగా శ్రమించి పూర్తి ఫిట్నెస్ సాధించి మళ్లీ ఆడటం మొదలుపెట్టాడు.
అండర్ 19 ప్రపంచకప్ విజయంతో టీమిండియాలోకి దూసుకొచ్చిన పృథ్వీ షా అంతే వేగంగా జట్టుకు దూరమయ్యాడు. పేలవ ఫామ్, బలహీనమైన బ్యాటింగ్ టెక్నిక్, అనవసర వివాదాలు, ఫిట్నెస్ కోల్పోవడం పృథ్వీ షా ఆటను దెబ్బతీసాయి. మరో సెహ్వాగ్ అవుతాడని దిగ్గజాల ప్రశంసలు అందుకున్న పృథ్వీ షా చివరకు దేశవాళీ స్టార్గానే మిగిలిపోయాడు.