ఐపీఎల్ 2025 మెగా వేలంలో అన్సోల్డ్గా నిలిచిన టీమిండియా యువ ఓపెనర్ పృథ్వీ షాను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) కనికరించినట్లు తెలుస్తోంది. దేశవాళీ ప్రతిష్టాత్మక టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో పృథ్వీ షా మెరుగైన ప్రదర్శన చేయడంతో అతని కనీస రూ. 75 లక్షలకు ఆర్సీబీ తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో విదర్భతో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో పృథ్వీ షా (26 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్లతో 49) విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగాడు. భారీ సిక్స్లతో విదర్భ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అజింక్య రహానే(45 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్లతో 84)తో కలిసి తొలి వికెట్కు 83 పరుగులు జోడించాడు.

దాంతో ఈ మ్యాచ్లో ముంబై 6 వికెట్ల తేడాతో గెలిచి సెమీఫైనల్ చేరింది. ఈ ఇన్నింగ్స్తో పృథ్వీ షా పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో పృథ్వీ షా ఒక్క హాఫ్ సెంచరీ నమోదు చేయకపోయినా.. నిలకడగా బ్యాటింగ్ చేశాడు. 33, 0, 23, 40, 0, 34, 49 పరుగులతో రాణించాడు. ఈ క్రమంలోనే ఆర్సీబీ.. పృథ్వీ షాను తీసుకునేందుకు ఆసక్తి చూపించినట్లు తెలుస్తోంది.
ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఆర్సీబీ 22 మంది ఆటగాళ్లను మాత్రమే కొనుగోలు చేసింది. ఐపీఎల్ టీమ్స్.. గరిష్టంగా 25 ఆటగాళ్లను తీసుకోవచ్చు. ఇక ఆర్సీబీ పర్స్ వాల్యూలో సరిగ్గా రూ. 75 లక్షలే మిగిలి ఉన్నాయి. అంతేకాకుండా ఐపీఎల్ 2025 మెగా వేలం తర్వాత ఆర్సీబీ వద్ద మాత్రమే రూ. 75 లక్షల పర్స్ మనీ ఉంది.
దాంతో పృథ్వీ షాను ఆర్సీబీ తీసుకుందనే వార్తలకు బలం చేకూరుతోంది. అయితే ఈ విషయంపై ఆర్సీబీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. పృథ్వీ షాను ఆర్సీబీ తీసుకుంటే ఆ జట్టుకు కలిసి రానుంది. ముఖ్యంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలోని చిన్న బౌండరీలు పృథ్వీ షా హిట్టింగ్కు సరిగ్గా సరిపోతాయి.
నవంబర్లో సౌదీ అరేబియాలోని జడ్డా వేదికగా జరిగిన మెగా వేలంలో రూ. 75 లక్షల కనీస ధరతో పృథ్వీ షా అందుబాటులో ఉండగా.. అతన్ని తీసుకునేందుకు ఫ్రాంచైజీలు పెద్దగా ఆసక్తి చూపలేదు. ఒక్క టీమ్ కూడా పృథ్వీ షా కోసం బిడ్ వేయకపోవడంతో అన్సోల్డ్గా నిలిచిన సంగతి తెలిసిందే.
అధిక బరువు, ఫిట్నెస్ సమస్యలతో పాటు నిలకడలేమి ఆట, సరైన క్రమ శిక్షణ లేదనే కారణాలతో ఫ్రాంచైజీలు పృథ్వీ షాను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపలేదు. అండర్ 19 ప్రపంచకప్తో భారత్ క్రికెట్లోకి తారా జువ్వలా దూసుకొచ్చిన పృథ్వీ షా అంతే వేగంగా జట్టుకు దూరమయ్యాడు.
భారత్ క్రికెట్ను ఏలాల్సినోడు ఐపీఎల్లో అన్సోల్డ్గా నిలవడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. సెహ్వాగ్ తరహాలో ఫియర్లెస్ గేమ్ ఆడే పృథ్వీ షా .. మరో వినోద్ కాంబ్లీలా తయారయ్యాడని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. అతని సారథ్యంలో ఆడిన శుభ్మన్ గిల్ టీమిండియా కెప్టెన్సీ రేసులో ఉండగా.. అర్ష్దీప్ సింగ్ స్టార్ పేసర్ అయ్యాడు.
రియాన్ పరాగ్, అభిషేక్ శర్మ అంతర్జాతీయ టీ20లు ఆడుతున్నారు. వీళ్లందరి కంటే ముందే భారత జట్టు తరఫున అవకాశాలు అందుకున్న పృథ్వీ షా మాత్రం అన్సోల్డ్గా నిలిచిపోయాడు.