ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీ 2025-26 సీజన్కు ముందు టీమిండియా వెటరన్ బ్యాటర్ పృథ్వీ షా సెంచరీతో చెలరేగాడు. తన పాత జట్టు ముంబైతో జరిగిన వామప్ మ్యాచ్లో పృథ్వీ షా మహరాష్ట్ర తరఫున బరిలోకి దిగి సత్తా చాటాడు. సుదీర్ఘ కాలం ముంబైకి ఆడిన పృథ్వీ షా.. ఇటీవలే మహారాష్ట్రకు మారాడు. మహారాష్ట్ర తరఫున బుచ్చి బాబు టోర్నీలో అరంగేట్ర మ్యాచ్లోనే సెంచరీ బాదాడు.
ముంబై రంజీ టీమ్లో అవకాశాలు రాకపోవడం, ఆ జట్టు సెలెక్టర్లపై పృథ్వీ షా విమర్శలు గుప్పించడం, వాటికి ముంబై క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు కౌంటరివ్వడం తెలిసిందే. ఫిట్నెస్ సరిగ్గా లేదని ముంబై సెలెక్టర్లు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలోనే అతను ఆ జట్టును వీడినట్లు వార్తలు వచ్చాయి.

అక్టోబర్ 15 నుంచి రంజీ ట్రోఫీ 2025-26 సీజన్ ప్రారంభం కానుంది. గ్రూప్-డీలో భాగంగా జమ్ము-కశ్మీర్తో ముంబై తొలి మ్యాచ్ ఆడనుంది. ఎలైట్ గ్రూప్-బీలో కేరళతో మహారాష్ట్ర తొలి మ్యాచ్ ఆడనుంది. రంజీ ట్రోఫీ ప్రారంభానికి ముందు ముంబై, మహారాష్ట్ర జట్ల మధ్య మంగళవారం మూడు రోజుల వామప్ మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్లో సెంచరీ బాదిన పృథ్వీ షా.. అర్షిన్ కులకర్ణితో కలిసి 305 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. డబుల్ సెంచరీ దిశగా సాగిన పృథ్వీ షా(186)ను షామ్స్ ములానీ ఔట్ చేశాడు. దాంతో ముంబై ఊపిరి పీల్చుకుంది.
ఇప్పటి వరకు 58 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడిన పృథ్వీ షా 46.02 సగటుతో 4556 పరుగులు చేశాడు. గతేడాది దేశవాళీ క్రికెట్లో పృథ్వీ షా దారుణంగా విఫలమయ్యాడు. దాంతో ఐపీఎల్ 2025 వేలంలో అన్సోల్డ్గా నిలిచాడు. ముంబై రంజీ టీమ్లో శివమ్ దూబే, తుషార్ దేశ్పాండేతో పాటు అజింక్యా రహానే ఉండగా.. శార్దూల్ ఠాకూర్ సారథ్యం వహించనున్నాడు. మహారాష్ట్ర జట్టులో సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, కేరళ ఆల్రౌండర్ జలజ్ సక్సెనా వంటి ఆటగాళ్లు ఉన్నారు.