టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వడమే తన లక్ష్యమని ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ పృథ్వీ షా అన్నాడు. అందుకోసం ఎంతకైనా తెగిస్తానని, 200 శాతం కష్టపడుతానని తెలిపాడు. ఐపీఎల్ 2025 సీజన్ వేలంలో అన్సోల్డ్గా నిలిచిన పృథ్వీ షాను ఈ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ కనుకరించి రూ.75 లక్షల కనీస ధరతో కొనుగోలు చేసింది.
అతనికి తుది జట్టులో చోటు దక్కుతుందా? లేదా?అనేది గ్యారెంటీ లేదు. ఐపీఎల్ 2026 సీజన్ నేపథ్యంలో ఓ వార్తా ఎజెన్సీతో మాట్లాడిన పృథ్వీ షా.. టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వడమే తన ఏకైక లక్ష్యమని చెప్పాడు.
'టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వడం కోసం నేను ఇంకా క్రికెట్ ఆడుతున్నాను. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. అందుకోసం నేను చాలా కష్టపడుతున్నాను. గతంలో కంటే మూడు రెట్లు ఎక్కువ కష్టపడుతున్నాను. వాస్తవానికి ఈ విషయం గురించి మాట్లాడటానికి నాకు ఇష్టం లేదు. కానీ భారత జట్టులోకి తిరిగి రావడానికి, ట్రోఫీని గెలవడానికి నా సాయశక్తులా ప్రయత్నిస్తాను. జట్టు విజయం కోసం 100 శాతం కాదు.. 200 శాతం కృషి చేస్తాను.
గత కొన్నేళ్లుగా నేను ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నాను. వాటన్నింటినీ నేను చిరనవ్వుతో స్వీకరించాను. నేను తిరిగి జట్టులోకి వచ్చినా.. అవన్నీ నా మనసులోనే ఉంటాయి. టీమిండియాలోకి రావాలంటే ఒకటే మార్గం. కష్టపడాలి.. సాయశక్తుల కృషి చేయాలి. తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోవాలి.

ఢిల్లీ క్యాపిటల్స్ తుది జట్టులో చోటు గురించి ఆలోచించడం లేదు. ఒకవేళ కేఎల్ రాహుల్ ఓపెనర్గా బరిలోకి దిగితే.. అతనితో కలిసి ఎవరు ఆడినా బాగా ఆడాలి. నేనే ఓపెనింగ్ చేయాలని కోరుకోవడం లేదు. ఎవరు ఓపెనింగ్ చేసినా.. జట్టుకు విజయాన్ని అందించాలి.
తుది జట్టులో ఖచ్చితంగా పోటీ ఉంది. మీరు రంజీ ట్రోఫీ ఆడినా.. ఐపిఎల్ , టీమిండియా, ఇండియా-ఏ తరఫున ఆడినా క్రికెట్లో పోటీ అనేది ఉంటుంది. ప్రస్తుతం 10 మంది ఓపెనర్లు ఉన్నారు. కాబట్టీ పోటీ ఖచ్చితంగా ఉంటుంది.'అని పృథ్వీ షా చెప్పుకొచ్చాడు.
అండర్ 19 ప్రపంచకప్ విజయంతో భారత క్రికెట్లోకి తారాజువ్వలా దూసుకొచ్చిన పృథ్వీ షా అంతే వేగంగా జట్టుకు దూరమయ్యాడు. టీమిండియా భవిష్యత్తు సారథి అవుతాడని ప్రశంసలు అందుకున్న ఈ ముంబై కుర్రాడు.. ప్రస్తుతం ఐపీఎల్లోనూ నిలదొక్కుకోలేకపోతున్నాడు. గాయాలు, ఫిట్నెస్ సమస్యలతో పాటు చెడు స్నేహాలు పృథ్వీ షా కెరీర్ను నాశనం చేశాయి.