న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు కరోనా వైరస్ కట్టడికి ప్రముఖ క్రీడాకారులు ముందుకు వస్తున్నారు. తమ వంతు సాయంగా విరాళాలు ప్రకటిస్తున్నారు. ప్రధాని మోదీ ఏర్పాటు చేసిన పీఎం-కేర్స్కు డొనేషన్స్ ఇస్తున్నారు. టీమిండియా వైస్కెప్టెన్ రోహిత్శర్మ, భారత మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్, పారాలింపిక్ అథ్లెట్ శరద్ కుమార్, భారత్ షూటర్ ఇషా సింగ్ పీఎంకేర్స్కు సోమవారం తమ విరాళలను ప్రకటించారు. ఈ నేపథ్యంలో వీరికి ప్రధాని మోదీ ట్విటర్లో ధన్యవాదాలు తెలిపారు.
''కొవిడ్-19పై చేస్తున్న యుద్ధంలో మన క్రీడాకారులు ముందుండడం ఎంతో సంతోషంగా ఉంది. పీఎం కేర్స్కు విరాళాలు ఇచ్చిన రోహిత్ శర్మ, మిథాలీ రాజ్, శరద్ కుమార్, ఇషా సింగ్లకు ధన్యవాదాలు'' అని ట్వీట్ చేశారు. ఇక కరోనాపై పోరాటానికి హిట్మ్యాన్ రూ.80 లక్షలు, మిథాలీ రాజ్ రూ.10 లక్షలు, శరద్ కుమార్ రూ.లక్ష, 15 ఏళ్ల ఇషా సింగ్ రూ.30 వేలు సాయం చేసిన సంగతి తెలిసిందే.
ఇక టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, అతని సతీమణి అనుష్క శర్మ సైతం తమ సాయాన్ని ప్రకటించారు. అయితే ఎంతా? అనే విషయాన్ని మాత్రం తెలియజేయలేదు. వారి సన్నిహితుల సమాచారం మేరకు విరుష్క జోడీ రూ.3 కోట్లు విరాళం అందజేసినట్లు తెలుస్తుంది. ఇక సౌరవ్ గంగూలీ రూ.50 లక్షలు, సచిన్ టెండూల్కర్ రూ.50 లక్షలు, సురేశ్ రైనా రూ.52 లక్షలు, అజింక్యా రహానే రూ.10 లక్షల సాయాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే.
బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు తెలుగు రాష్ట్రాలకు రూ.10 లక్షల విరాళం అందజేయగా.. టెన్నిస్ స్టార్ సానియా మీర్జా కోటిన్నర సాయం ప్రకటించింది. స్టార్ రెజ్లర్ బజరంగ్ పూనియా తన ఆరు నెలల జీతం, స్టార్ స్ప్రింటర్ హిమాదాస్ ఒక నెల జీతాన్ని సాయంగా ప్రకటించారు.