
ముంబై: కొత్త పేరుతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ 2021 సీజన్ ఫస్ట్ మ్యాచ్లోనే పంజా విసిరింది. ఆఖరి బంతి వరకు హోరాహోరీగా సాగిన మ్యాచ్లో భారీ టార్గెట్ను కాపాడుకుంది. వాంఖడే స్టేడియంలో సోమవారం జరిగిన హై స్కోరింగ్ మ్యాచ్లో పంజాబ్ 4 రన్స్ తేడాతో రాజస్థాన్ రాయల్స్ను ఓడించి బోణీ కొట్టింది. అయితే ఈ మ్యాచ్ ఫలితంపై స్పందించిన బాలీవుడ్ బ్యూటీ, పంజాబ్ కో ఓనర్ ప్రీతీ జింటా.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
పేరు మార్పుతో తమ జట్టు రాత మారినా.. తమకు హార్ట్ ఎటాక్ తెప్పిస్తూనే ఉన్నారని ట్వీట్ చేసింది. 'పంచ్ అదిరింది. వాటే గేమ్. మేము కొత్త జెర్సీ-కొత్త పేరుతో ఈ సీజన్ బరిలోకి దిగినా.. సద్దా పంజాబ్ ఆటగాళ్లు మాకు హార్ట్ ఎటాక్లు తెప్పించడం మాత్రం ఆపలేదు. ఇది కచ్చితంగా మాకు పర్ఫెక్ట్ గేమ్ కాదు. కానీ చివర్లో ముంగిపు మాత్రం సూపర్బ్. కేఎల్ రాహుల్, దీపక్ హుడా, టీమ్ ఆటగాళ్లంతా అదరగొట్టారు'అని పేర్కొంది. ప్రస్తుతం ఈ బ్యూటీ ట్వీట్ నెట్టింట హల్ చల్ చేస్తుంది. ఇక గత సీజన్లో పంజాబ్ ప్రతీ మ్యాచ్ దగ్గరగా వచ్చి ఓడింది. డబల్ సూపర్ ఓవర్లు ఆడింది. ఆ క్రమంలోనే ప్రీతీ జింటా గుండెపోట్లు తెప్పించడం మాత్రం ఆపడం లేదని కామెంట్ చేసింది.
గత సీజన్లో ఇదే రాజస్థాన్ రాయల్స్తో షార్జా వేదికగా జరిగిన హై స్కోరింగ్ మ్యాచ్లో పంజాబ్ చివరి ఓవర్లో ఓటమిపాలైంది. రాహుల్ తెవాటియా ఒకే ఓవర్లో వరుసగా 5 సిక్సర్లు కొట్టి రాజస్థాన్ను గెలిపించాడు. ఆ ఓటమికి పంజాబ్ తాజా మ్యాచ్లో ప్రతీకారం తీర్చుకుంది.
నిన్నటి మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 221 రన్స్ చేసింది. కెప్టెన్ కేఎల్ రాహుల్(50 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లతో 91), దీపక్ హుడా పరుగుల సునామీ సృష్టించారు. వీరికి అండగా యూనివర్స్ బాస్ క్రిస్ గేల్(28 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 40)రాణించాడు. ఇక 222 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్.. ఓవైపు వికెట్లు కోల్పోతూనే మరోవైపు లక్ష్యం దిశగా దూసుకొచ్చింది.
పంజాబ్ ఆటగాళ్లు ఇచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్న సంజూ శాంసన్(63 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్స్లతో 119) సెంచరీతో ఆఖరి బంతి వరకు పోరాడాడు. ఇక చివరి ఓవర్లో పంజాబ్ విజయానికి 13 పరుగుల అవసరం కాగా.. యువ బౌలర్ అర్ష్ దీప్ సింగ్ అద్భుతంగా బౌలింగ్ చేసి జట్టుకు విజయాన్నందించాడు. పంజాబ్ బౌలర్లలో అర్ష్దీప్ సింగ్ మూడు వికెట్లు తీయగా.. మహ్మద్ షమీ రెండు, రిలే మెరిడిత్, జై రిచర్డ్సన్ చెరొక వికెట్ దక్కించుకున్నారు.