
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ అనగానే చాలా మందికి గుర్తొచ్చే వ్యక్తి బాలీవుడ్ హీరోయిన ప్రీతీ జింటా. కింగ్స్ పంజాబ్ సహయజమానీ అయిన ఈ సొట్ట బుగ్గల సుందరీ మైదానంలో చేసే హడావుడి అంత ఇంత కాదు. తమ బ్యాట్స్మన్ సిక్స్ కొట్టినా.. ఫోర్ బాదినా.. కింగ్స్ పంజాబ్ బౌలర్ వికెట్ తీసినా గ్యాలరీలో గంతేస్తుంది.
ఫ్లైయింగ్ కిస్సులతో ఆటగాళ్లలో హుషారు రెకెత్తిస్తోంది. ఇక మ్యాచ్ గెలిస్తే వారిని హత్తుకుంటుంది. పట్టరాని సంతోషంతో ఫ్రాంచైజీ టీషర్టులను అభిమానుల వైపుకు విసురుతుంది. అటు ఆటగాళ్లను ఇటు అభిమానులను తనదైన చర్యలతో ఉత్సాహపరుస్తుంది. అలాంటి ప్రీతి జింటా ఈసారి ఇంకా తన సందడి మొదలు పెట్టలేదే.. అనుకుంటున్న తరుణంలో సోషల్ మీడియా వేదికగా ప్రత్యక్షమైంది.
ఐపీఎల్ 2020 సీజన్ ప్రమోషన్స్లో భాగంగా కింగ్స్ పంజాబ్ షేర్ చేసిన ఓ వీడియోపై ప్రీతీ జింటా వ్యంగ్యాస్త్రాలు సంధించింది. యువ ఆటగాళ్లు అర్షదీప్ సింగ్, హర్ప్రీత్ సింగ్ బ్యాటింగ్, బౌలింగ్ ఫోజులతో బ్యాంక్ రౌండ్లోనే ట్యూన్కు చిందేశారు. ఈ వీడియోను కింగ్స్ పంజాబ్ 'ఆట, పాట, డ్యాన్స్, ఆల్ ఇన్ వన్'అనే క్యాప్షన్తో షేర్ చేసింది. ఈ వీడియో తెగ వైరల్ కాగా.. అభిమానులు తమదైన శైలిలో స్పందించారు.

ఈ నేపథ్యంలోనే ప్రీతీ జింటా కూడా 'మన ఆటగాళ్లు తెగ కష్టపడుతున్నారుగా'అని కామెంట్ చేసింది. దీనికి కింగ్స్ పంజాబ్ ఫన్నీ ఏమోజీతో స్పందించింది. ఇక కరోనా నేపథ్యంలో కింగ్స్ పంజాబ్ జట్టు బాధ్యతలను నెస్ వాడియా చూసుకుంటున్నట్లు తెలుస్తోంది. అతనే తరుచూ మీడియాతో జట్టుకు సంబంధించిన వివరాలను తెలియజేస్తున్నాడు.
ప్రీతి జింటా పేరు మాత్రం ఎక్కడా వినిపించలేదు. కరోనా నిబంధనల నేపథ్యంలో ఈ సీజన్లో ప్రీతీ జింటా సందడిని అభిమానులు మిస్ కానున్నారు. ఇక గత 12 సీజన్లుగా టైటిల్ గెలవలేకపోయిన కింగ్స్ పంజాబ్.. ఈ సారి తమ కెప్టెన్, కోచ్ను మార్చింది. అనిల్ కుంబ్లే పర్యవేక్షణలో కేఎల్ రాహుల్ సారథ్యంలో టైటిలే లక్ష్యంగా బరిలోకి దిగుతుంది. గ్లేన్ మ్యాక్స్ వెల్, క్రిస్ గేల్, క్రిస్ జోర్డాన్ వంటి హిట్టర్లను కలిగి ఉన్న ఆ జట్టు.. సెప్టెంబర్ 20న ఢిల్లీ క్యాపిటల్స్తో తొలి మ్యాచ్ ఆడనుంది.