
దుబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)2020 సీజన్లో భాగంగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య ఆదివారం జరిగిన రసవత్తపోరు అభిమానులకు కావాల్సిన మజానిచ్చింది. సూపర్ ఓవర్కు దారితీసిన ఈ మ్యాచ్లో ఢిల్లీ అద్భుత విజయాన్నందుకుంది. ఆఖరి క్షణం వరకు ఇరు జట్లను దోబుచూలాడిన విజయం ప్రతీ ఒక్కరిని ఉక్కిరి బిక్కిరి చేసింది. అయితే ఓటమి అంచున చేరిన ఢిల్లీ జట్టును మార్కస్ స్టోయినిస్ అద్భుత బౌలింగ్తో రేసులో నిలబెట్టగా.. సూపర్ ఓవర్ స్పెషలిస్ట్ కగిసో రబడా తన మార్క్ పెర్ఫామెన్స్తో ఏకంగా విజయాన్నే అందించాడు.
ఇక ఈ మ్యాచ్లో అంపైర్ తీసుకున్న తప్పుడు నిర్ణయం కింగ్స్ పంజాబ్ ఓటమికి కారణమైంది. దీంతో సదరు అంపైర్పై మాజీ క్రికెటర్లు, అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. షార్ట్ రన్గా ప్రకటించిన ఆ అంపైర్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇవ్వాలని భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ట్విటర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ఈ నేపథ్యంలోనే కింగ్స్ పంజాబ్ సహాయజమాని ప్రీతీ జింటా కూడా ట్విటర్ వేదికగా అసహనం వ్యక్తం చేసింది. ఒక్క షార్ట్ రన్ తన నవ్వును చిదిమేసిందని, ఇలాంటి తప్పిదాలను ప్రతీ ఏడాది ఎన్ని చూడాలని ప్రశ్నించింది. బీసీసీఐ నిబంధనలను మార్చాలని డిమాండ్ చేసింది.
'కరోనా మహమ్మారి కారణంగా భయంగానే దుబాయ్లో అడుగుపెట్టా. ఆరు రోజుల క్వారంటైన్లో 5 కోవిడ్-19 పరీక్షల్లో పాజిటివ్ వచ్చిన తర్వాతే నవ్వాను. కానీ ఒక్క షార్ట్ రన్ నన్ను తీవ్రంగా బాధపెట్టింది. నా చిరునవ్వును చిదిమేసింది. ఇంత టెక్నాలజీ అందుబాటులో ఉన్నా ఏ లెక్కన ఉపయోగించరో అర్థం కావడం లేదు. ఇక బీసీసీఐ కొత్త నిబంధనలను విడుదల చేయాల్సి అవసరం వచ్చింది. ప్రతీ ఏడాది ఇలాంటి తప్పిదాలను మేం చూడలేం.'అని ఈ సొట్ట బుగ్గల సుందరి ఆగ్రహం వ్యక్తం చేసింది.
'గెలుపు, ఓటముల కన్నా స్పూర్తిదాయకంగా ఆడటమే ముఖ్యమని నమ్ముతాను. అలాగే ఆటను మెరుగుపరిచే విధానాలను అమలు చేయండని అడగడం కూడా ముఖ్యమనే అనుకుంటున్నా. ఇక గతం గత: సానుకూల దృక్పథంతో ముందుకు నడవడమే ముఖ్యం'అని మరో ట్వీట్లో పేర్కొంది.
58 పరుగుల లక్ష్యచేధనకు దిగిన పంజాబ్ ఆరంభంలో తడబడినా.. మయాంక్ సూపర్ ఇన్నింగ్స్తో విజయం ముంగిట నిలిచింది. ఆ జట్టు విజయానికి 12 బంతుల్లో 25 పరుగుల కావాల్సిన క్రమంలో రబడా 19వ ఓవర్ అందుకున్నాడు. క్రీజులో మయాంక్, క్రిస్ జోర్డాన్ ఉన్నారు. తొలి బంతిని డాట్ చేసిన అగర్వాల్ రెండో బంతిని ఫోర్ కొట్టాడు. ఇక మూడో బంతి ఎక్స్ట్రా కవర్ రీజియన్ వైపు ఆడి క్విక్ డబుల్ తీశాడు. అయితే లెగ్ అంపైర్ నితీన్ మీనన్.. క్రిస్ జోర్డాన్ పరుగులు పూర్తి చేయలేదని ఓ రన్ షార్ట్ చేశాడు. అయితే టీవీ రిప్లేలో మాత్రం అతను లైన్మీదనే బ్యాట్ పెట్టినట్లు స్పష్టమైంది. ఈ పరుగే ఆ జట్టు ఖాతాలో చేరి ఉంటే పంజాబ్ సూపర్ ఓవర్కు ముందే గెలిచేది.