ఇంగ్లండ్ గడ్డపై టీమిండియా పేసర్ ప్రసిధ్ కృష్ణ వైఫల్యం కొనసాగుతోంది. తొలి టెస్ట్లో దారుణంగా విఫలమైన టీమిండియా ఓటమికి కారణమైన ఈ కర్ణాటక పేసర్.. రెండో టెస్ట్లోనూ ధారళంగా పరుగులిచ్చుకుంటున్నాడు. మూడో రోజు ఆటలో మహమ్మద్ సిరాజ్ అదిరిపోయే ఆరంభం అందిస్తే.. ప్రసిధ్ కృష్ణ పేలవ బౌలింగ్తో మూమెంటమ్ను దెబ్బతీసాడు. అతని బౌలింగ్లో ఇంగ్లండ్ బ్యాటర్లు స్వేచ్ఛగా బౌండరీలు బాదుతున్నారు.
జేమీ స్మిత్ అయితే టీ20 తరహాలో భారీ సిక్సర్లతో ప్రసిధ్ కృష్ణపై విరుచుకుపడ్డాడు. ప్రసిధ్ కృష్ణ వేసిన 32వ ఓవర్లో జెమీ స్మిత్ 6, 4, 4, వైడ్, 4తో 23 పరుగులు పిండుకున్నాడు. అప్పటి వరకు స్లోగా ఆడిన ఇంగ్లండ్ బ్యాటర్లు.. ప్రసిధ్ కృష్ణ బౌలింగ్తో పండుగ చేసుకున్నారు. వేగంగా ఆడుతూ ఇప్పటికే 100 పరుగుల భాగస్వామ్యాన్ని పూర్తి చేసుకున్నారు. ప్రసిధ్ కృష్ణ బౌలింగ్ అభిమానులతో పాటు కామెంటేటర్లకు ఆగ్రహం తెప్పించింది.

షార్ట్ పిచ్ బాల్స్తో ఇంగ్లండ్ బ్యాటర్లను బోల్తా కొట్టించాలనే భారత వ్యూహం బెడిసి కొట్టింది. ప్రసిధ్ రాంగ్ లైన్లో బౌన్సర్లు సంధించడం.. బౌలింగ్లో వేరియేషన్ చూపించకుండా ప్రతీ బంతిని బౌన్సర్గా వేయడం ఇంగ్లండ్ బ్యాటర్లకు కలిసొచ్చింది. మూడో రోజు ఆటలో ప్రసిధ్ వేసిన ప్రతీ ఓవర్లో ఇంగ్లండ్ బ్యాటర్లు బౌండరీ బాదారు. 8 ఓవర్లు బౌలింగ్ చేసిన ప్రసిధ్ కృష్ణ 7.62 ఎకానమీతో 61 పరుగులు ఇచ్చుకున్నాడు. ప్రసిధ్ వైఫల్యం ఇతర బౌలర్లపై ప్రభావం చూపుతుంది. మూమెంటమ్ మొత్తం ఇంగ్లండ్వైపు మళ్లింది. క్రీజులో ఉన్న జెమీ స్మిత్, హ్యారీ బ్రూక్ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకొని శతకాల దిశగా సాగుతున్నారు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్లో 587 పరుగుల భారీ స్కోర్ చేసింది. శుభ్మన్ గిల్(387 బంతుల్లో 30 ఫోర్లు, 3 సిక్స్లతో 269) రికార్డ్ డబుల్ సెంచరీతో చెలరేగగా.. రవీంద్ర జడేజా(137 బంతుల్లో 10 ఫోర్లు, సిక్స్తో 89), యశస్వి జైస్వాల్(107 బంతుల్లో 13 ఫోర్లతో 87) తృటిలో శతకాలు చేజార్చుకున్నారు. వాషింగ్టన్ సుందర్(103 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 42) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇంగ్లండ్ బౌలర్లలో షోయబ్ బషీర్(3/167) మూడు వికెట్లు తీయగా.. క్రిస్ వోక్స్(2/81), జోష్ టంగ్(2/119) రెండేసి వికెట్లు పడగొట్టారు. బ్రైడన్ కార్స్, బెన్ స్టోక్స్, జో రూట్ చెరో వికెట్ తీసారు