
న్యూఢిల్లీ: భారత జట్టు సెలెక్షన్ కమిటీ తీరుపై మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, ఆశిష్ నెహ్రాలతో పాటు సీనీయర్ క్రికెటర్ సురేశ్ రైనా సైతం అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసింది. కారణం చెప్పకుండా జట్టు నుంచి ఆకస్మాత్తుగా తీసేస్తారని, ఎందుకు పక్కకు పెట్టారో కూడా చెప్పారని ఇటీవల ఈ క్రికెటర్లు వ్యాఖ్యానించారు. అయితే తాజాగా వీరి సరసన భారత మాజీ స్పిన్నర్, హైదరాబాద్ స్టార్ క్రికెటర్ ప్రజ్ఞాన్ ఓజా కూడా చేరాడు. మైదానంలో అద్భుత ప్రదర్శన కనబరిస్తే జట్టులో చోటు స్థిరంగా ఉంటుదన్న మాట అవాస్తవమని, ఒక్కోసారి ఎంత గొప్పగా రాణించినా మళ్లీ జట్టు జెర్సీ ధరించే అవకాశం లభించదని ఈ భారత మాజీ స్పిన్నర్ తెలిపాడు.
ఇటీవల ఇన్స్టాగ్రామ్ లైవ్లో మాట్లాడిన ఈ హైదరాబాద్ స్టార్ క్రికెటర్.. ఆటగాళ్ల విషయంలో సెలక్షన్ కమిటీ అనుసరిస్తున్న తీరుపై అసహనం వ్యక్తం చేశాడు. జట్టులో చోటు లభించకపోతే ఎలా ఉంటుందనే ఓ అభిమాని ప్రశ్నించగా ఓజా ఈ విధంగా స్పందించాడు.
'ఇతర దేశాలతో పోల్చితే భారత్లో సెలక్షన్ కమిటీకి, ఆటగాళ్లకు మధ్య కమ్యూనికేషన్ లోపం ఉంటుంది. దానివల్ల జట్టును ప్రకటించే వరకు మనం ఉన్నామో.. లేదో కూడా తెలిసేది కాదు. జట్టును ప్రకటించిన తరువాత మన పేరు ఉంటే ఉన్నట్లు.. లేదంటే లేనట్లుగా మనం అర్థం చేసుకోవాలి. అదే నాకు చాలా బాధ కలిగించేది. అంతర్జాతీయ మ్యాచ్లతో పాటు దేశవాళీ మ్యాచ్లకు కూడా ఇదే పద్ధతి అమలులో ఉంటుంది.'అని ఓఝా చెప్పుకొచ్చాడు. ఆట మీద దృష్టి పెట్టి సాధన చేసుకుంటూ వెళ్లాల్సిందే కానీ, జట్టులో స్థానం కోసం వేచి చూస్తూ ఉంటే ఎటువంటి లాభం ఉండదన్నాడు.
ఇక 2009లో శ్రీలంకతో జరిగిన టెస్ట్ మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అడుగు పెట్టిన ఓఝా 24 టెస్టులు ఆడి 113 వికెట్లు తీశాడు. ఆ తరువాత అనేక మ్యాచ్ల్లో చక్కటి ప్రదర్శన చేశాడు. 2013లో వెస్టిండీస్తో జరిగిన టెస్ట్ సిరీస్లో చివరి సారిగా కనిపించి ఓజా.. సచిన్ వీడ్కోలు మ్యాచ్లో అద్భుత ప్రదర్శన కనబర్చాడు. రెండు ఇన్నింగ్స్ల్లోనూ 5 వికెట్ల చొప్పున 10 వికెట్లు తీశాడు. అయినప్పటికీ అతడికి ఆ తరువాత భారత జట్టుకు ఆడే అవకాశం రాలేదు.
జట్టులోకి పునరాగమనం చేసేందుకు ఐపీఎల్తో పాటు దేశవాళీ క్రికెట్ మ్యాచ్లు తరచుగా ఆడినప్పటికీ అదృష్టం వరించలేదు. ఈ నేపథ్యంలో 2020లో ఫిబ్రవరిలో ఓఝా అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు.