కోల్కతా నైట్రైడర్స్(కేకేఆర్) మాజీ ప్లేయర్ కావడంతోనే సూర్యకుమార్ యాదవ్కు టీమిండియా టీ20 కెప్టెన్సీ బాధ్యతలు దక్కాయని మాజీ క్రికెటర్, హైదరాబాద్ స్టార్ ప్రజ్ఞాన్ ఓజా అన్నాడు. కేకేఆర్ కెప్టెన్గా గౌతమ్ గంభీర్ ఉన్న సమయంలో సూర్యకుమార్ యాదవ్ వైస్ కెప్టెన్గా వ్యవహరించాడని, ఆ సమయంలో ఆ ఇద్దరి మధ్య మంచి సంబంధాలున్నాయని గుర్తు చేశాడు.
ఆ సత్సంబంధాల నేపథ్యంలోనే హెడ్ కోచ్గా గౌతమ్ గంభీర్ ఎంపికైన వెంటనే.. టీ20 సారథిగా సూర్యను తీసుకున్నాడని తెలిపాడు. అంతేకాకుండా హార్దిక్ పాండ్యా ఫిట్నెస్ సమస్యగా మారుతుందని కూడా గంభీర్, సెలెక్టర్ల భావించారని తెలిపాడు. రాహుల్ ద్రవిడ్ వారసుడిగా టీమిండియా హెడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టిన గంభీర్.. తన మార్క్ నిర్ణయాలు తీసుకుంటున్నాడు.

టీ20 సారథ్య బాధ్యతల నుంచి హార్దిక్ పాండ్యాను తప్పించి సూర్యకుమార్ యాదవ్కు అప్పగించాడు. శుభ్మన్ గిల్ను మూడు ఫార్మాట్లకు వైస్ కెప్టెన్గా ఎంపిక చేశాడు. ప్రస్తుతం శ్రీలంక పర్యటనకు వెళ్లిన టీమిండియా శనివారం నుంచి మూడు టీ20లు, ఆగస్ట్ 2 నుంచి మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఈ క్రమంలో తాజాగా వన్ ఇండియా హిందీ చానెల్తో మాట్లాడిన ప్రజ్ఞాన్ ఓజా.. కెప్టెన్సీ మార్పుపై ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.
'సూర్యకుమార్ యాదవ్ చాలా తెలివైన ఆటగాడు. అతనికి గంభీర్తో మంచి సంబంధాలున్నాయి. ఐపీఎల్లో ఈ ఇద్దరి కలిసి కేకేఆర్కు ఆడారు. గౌతమ్ గంభీర్ కెప్టెన్గా ఉన్నప్పుడు సూర్యకుమార్ యాదవ్ అతనికి డిప్యూటీగా వ్యవహరించాడు. కాబట్టి వారిద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉంది. హార్దిక్ పాండ్యాను ఫిట్నెస్ సమస్యలు వెంటాడుతాయని గంభీర్, సెలెక్టర్లు భావించారు. దాంతోనే అతన్ని తప్పించి సూర్యకుమార్ యాదవ్కు సారథ్య బాధ్యతలు అప్పగించారు.
టీ20 ప్రపంచకప్ 2026ను దృష్టిలో పెట్టుకొని కెప్టెన్సీ మార్పు నిర్ణయం తీసుకున్నారు. టీ20 సారథిగా అనుభవంతో పాటు మెచ్యూరిటీ కలిగిన ఆటగాడు కావాలనుకున్నారు. హార్దిక్ పాండ్యా తర్వాత సూర్యకుమార్ యాదవ్ బెస్ట్. అతని కంటే అత్యుత్తమమైన ఆటగాళ్లు ఎవరున్నారు? హార్దిక్ పాండ్యా ఫిట్నెస్ సమస్యలు ఎదురుయ్యే అవకాశం ఉండటంతో సూర్యను ఎంపిక చేశారు. ఇది సరైన నిర్ణయమని నా ఫీలింగ్'అని ప్రజ్ఞాన్ ఓజా చెప్పుకొచ్చాడు.
శ్రీలంక పర్యటనకు ఎంపికైన భారత టీ20 జట్టు: సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), శుభ్మన్ గిల్(వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, రింకూ సింగ్, రియాన్ పరాగ్, రిషభ్ పంత్(కీపర్), సంజూ శాంసన్(కీపర్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్ష్దీప్ సింగ్, ఖలీల్ అహ్మద్, మహమ్మద్ సిరాజ్.