హైదరాబాద్: దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే.. మైదానంలో చాలా విభిన్నంగా ఉంటాడని భారత మాజీ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా అన్నాడు. ఫీల్డ్లో ఉన్నప్పుడు కుంబ్లే చాలా దూకుడుగా ఉంటాడని, అదే మైదానం బయట మాత్రం చాలా సాఫ్ట్గా కనిపిస్తాడన్నాడు. 'ఫీల్డ్లో ప్రత్యర్థితో పాటు మాతో కూడా కుంబ్లే చాలా దూకుడుగా నడుచుకునేవాడు. ధ్యాసంతా మ్యాచ్పైనే ఉంటుంది. కానీ ఆఫ్ ద ఫీల్డ్ చాలా విభిన్నమైన వ్యక్తి. రెండింటిని అసలు పోల్చలేం'అని ఈ హైదరాబాద్ మాజీ స్పిన్నర్ చెప్పుకొచ్చాడు. ఇక సచిన్ కుంబ్లేకు ఏ విషయంలో పోలికలేదన్నాడు.
'సచిన్ పాజీ చాలా ప్రశాంతంగా ఉంటాడు. ఏ విషయంలోనూ తొందరపాటు ఉండదు. అనిల్ అప్రోచ్ చాలా డిఫరెంట్. ధోనీ, కోహ్లీల్లో భారత్ను గెలిపించాలనే తపనే ఎక్కువ. అయినా వీళ్ల అప్రోచ్ చాలా విభిన్నమైనది. వీవీఎస్ లక్ష్మణ్ సుప్రభాతం విని బ్యాటింగ్కు దిగుతాడు. అది అతని అగ్రెషన్. కోహ్లీ పంజాబి మ్యూజిక్ను ఎక్కువ సౌండ్లో వింటాడు. అతని ముఖంలో దాని తాలుకు లక్షణాలు కూడా కనిపిస్తాయి. ఇదో రకం అప్రోచ్'అని ఓజా వివరించాడు.
ఇక 2009లో శ్రీలంకతో జరిగిన టెస్ట్ మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అడుగు పెట్టిన ఓఝా 24 టెస్టులు ఆడి 113 వికెట్లు తీశాడు. ఆ తరువాత అనేక మ్యాచ్ల్లో చక్కటి ప్రదర్శన చేశాడు. 2013లో వెస్టిండీస్తో జరిగిన టెస్ట్ సిరీస్లో చివరి సారిగా కనిపించి ఓజా.. సచిన్ వీడ్కోలు మ్యాచ్లో అద్భుత ప్రదర్శన కనబర్చాడు. రెండు ఇన్నింగ్స్ల్లోనూ 5 వికెట్ల చొప్పున 10 వికెట్లు తీశాడు. అయినప్పటికీ అతడికి ఆ తరువాత భారత జట్టుకు ఆడే అవకాశం రాలేదు.
జట్టులోకి పునరాగమనం చేసేందుకు ఐపీఎల్తో పాటు దేశవాళీ క్రికెట్ మ్యాచ్లు తరచుగా ఆడినప్పటికీ అదృష్టం వరించలేదు. ఇక ఈ ఏడాది ఫిబ్రవరిలో ఓఝా అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు.