హైదరాబాద్: దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ వికెట్ తీసినందుకు తనకు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారని భారత మాజీ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా తెలిపాడు. ఐపీఎల్లో డెక్కన్ చార్జెస్ తరఫున ఆడేటప్పుడు ముంబై ఇండియన్స్ తరఫున బరిలోకి దిగిన సచిన్ ఔట్ చేశానని, అప్పుడు తన ఫ్రాంచైజ్ యజమాని తనకు వాచ్ గిఫ్ట్ ఇచ్చాడని ఓజా గుర్తు చేసుకున్నాడు. 2008 నుంచి 2011 ఐపీఎల్ సీజన్ వరకూ డెక్కన్ చార్జర్స్ తరఫున బరిలోకి దిగిన ఓజా.. సచిన్ టెండూల్కర్ రిటైర్మెంట్ వరకూ ముంబయి ఇండియన్స్ తరఫునే ఆడాడు.
భారత్లో సాధారణ ఎన్నికల కారణంగా 2009 ఐపీఎల్ సీజన్ దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన విషయం తెలిసిందే. ఇక ఈ సీజన్లో డర్బన్ వేదికగా ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో తాను సచిన్ వికెట్ పడగొట్టడాన్ని ఓజా తాజాగా గుర్తు చేసుకున్నాడు. ''ముంబైతో మ్యాచ్కి ముందు రోజు నేను నెట్స్లో బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా.. డెక్కన్ చార్జర్స్ ఓనర్ అక్కడికి వచ్చి నాతో ఓ మాట అన్నాడు. 'ప్రజ్ఞాన్.. నువ్వు రేపు మ్యాచ్లో సచిన్ వికెట్ పడగొడితే..? నీకు స్పెషల్ గిప్ట్ ఇస్తా' అని చెప్పాడు. దానికి బదులుగా నేను కూడా 'సార్.. ఒకవేళ నేను సచిన్ వికెట్ పడగొడితే.. నాకు వాచ్ కావాలి' అని కోరాను. మొత్తానికి తర్వాత రోజు మ్యాచ్లో నేను సచిన్ వికెట్ పడగొట్టడం.. నాకు వాచ్ గిప్ట్గా రావడం జరిగిపోయాయి'' అని ఓజా వెల్లడించాడు.
ఇక ఐపీఎల్ సీజన్ 2012 నుంచి 2015 వరకూ ముంబై ఇండియన్స్ తరఫున ఓజా మ్యాచ్లు ఆడగా.. 2014లో సచిన్ టెండూల్కర్ రిటైర్మెంట్ ప్రకటించిన మ్యాచ్ భారత్ తరఫున ఓజాకు కూడా ఆఖరి మ్యాచ్. ఆ తర్వాత టీమిండియాలోకి రీఎంట్రీ కోసం ఆరేళ్లు ఎదురుచూసిన ఓజా.. ఈ ఏడాది ఫిబ్రవరిలో రిటైర్మెంట్ ప్రకటించాడు.