
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశ రాజధాని ఢిల్లీ వేదికగా రైతుల చేస్తున్న దీక్ష కొనసాగుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం రైతుల ఆందోళనలు అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించాయి. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు రైతుల దీక్షకు మద్దతు తెలుపుతూ సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
ఈ క్రమంలోనే అమెరికా పాప్ సింగర్ రిహానా కూడా మంగళవారం ట్విటర్ వేదికగా రైతుల దీక్షను ప్రస్తావించింది. సీఎన్ఎన్ న్యూస్ ఆర్టికల్ను షేర్ చేస్తూ.. ఈ ఆందోళనల గురించి మనమెందుకు మాట్లాడకూడదంటూ ప్రశ్నించింది.
అయితే ఆమె ట్వీట్పై టీమిండియా మాజీ క్రికెటర్ ప్రజ్ఞాన్ ఓజా అభ్యంతరం వ్యక్తం చేశాడు. తమ అంతర్గాత వ్యవహరాల్లో జోక్యం చేసుకోవద్దని సుతిమెత్తంగా వార్నింగ్ ఇచ్చాడు. 'మా రైతుల పట్ల మా దేశం గర్వంగా ఉంది. వారు ఎంతో ముఖ్యమో మాకు బాగా తెలుసు. త్వరలో వారి సమస్యలకు పరిష్కారం లభిస్తుందని అనుకుంటున్నాను. మా అంతర్గత విషయాల్లో బయట వ్యక్తులు జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఏ మాత్రం లేదు'అని ఓజా ట్వీట్ చేశాడు.
అయితే ఓజా ట్వీట్పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఓజాను ప్రశింసిస్తుంటే.. మరికొందరు తప్పుబడుతున్నారు. ఇన్ని రోజులుగా రైతులు చేస్తున్న దీక్షలు కనబడలేదు కానీ.. విదేశీయులు మద్దుతు తెలిపితే అభ్యంతరం తెలుపుతున్నాడని విమర్శిస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అయింది.