టీ20 ప్రపంచకప్ 2024 నేపథ్యంలో టీమిండియా స్పిన్ కాంబినేషన్పై మాజీ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అగ్రరాజ్యం అమెరికాతో పాటు వెస్టిండీస్ వేదికగా జరిగే ఈ మెగా టోర్నీలో భారత జట్టు ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగాలని సూచించాడు.
బ్యాటింగ్ చేసే సామర్థ్యం కలిగిన రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్తో పాటు రవి బిష్ణోయ్లను ఈ మెగా టోర్నీకి ఎంపిక చేయాలని సూచించాడు. పరోక్షంగా కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్ అవసరం లేదని వెల్లడించాడు. తాజాగా ఓ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రజ్ఞాన్ ఓజా ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

అక్షర్ పటేల్పై ప్రశంసల జల్లు కురిపించిన ఓజా.. బంతితో పాటు బ్యాటింగ్ చేసే సామర్థ్యం కలిగిన అతను.. టీమిండియాకు ఎక్స్ ఫ్యాక్టర్ అవుతాడని చెప్పాడు. 'నా అభిప్రాయం ప్రకారం అయితే ప్రపంచకప్లో భారత జట్టు ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగాలి. వరల్డ్ నెంబర్ వన్ బౌలర్ రవీంద్ర జడేజాను మొదటి స్పిన్నర్గా ఎంపిక చేయాలి. అతని అనుభవం జట్టుకు ఉపయోగపడుతుంది. పైగా అతను బిగ్ మ్యాచ్ ప్లేయర్.
రెండో స్పిన్నర్గా రవి బిష్ణోయ్ను తీసుకోవాలి. ఈ కుర్రాడు గత కొంతకాలంగా నిలకడగా రాణిస్తున్నాడు. బ్యాటింగ్లోనూ మెరుపులు మెరిపించగలడు. మూడో స్పిన్నర్గా అక్షర్ పటేల్ను తీసుకోవాలి. క్లిష్ట పరిస్థితుల్లో అతను తెలివిగా బౌలింగ్ చేయగలడు.'అని ప్రజ్ఞాన్ ఓజా చెప్పుకొచ్చాడు.
జూన్ 1 నుంచి అమెరికా వేదికగా టీ20 ప్రపంచకప్ జరగనుండగా.. జూన్ 5న ఐర్లాండ్తో టీమిండియా తొలి మ్యాచ్ ఆడనుంది. ఇక మెగా టోర్నీకి ముందు టీమిండియా ఒకే ఒక్క టీ20 సిరీస్ ఆడనుంది. అది కూడా ప్రస్తుతం అఫ్గానిస్థాన్తో జరుగుతున్న సిరీసే. ఈ సిరీస్లో ఇప్పటికే రెండు మ్యాచ్లు జరగ్గా.. టీమిండియా రెండింటిలోనూ విజయం సాధించింది.
ఈ రెండు మ్యాచ్ల్లోనూ రవి బిష్ణోయ్కే అవకాశం దక్కింది. ఈ సిరీస్కు రవీంద్ర జడేజా దూరంగా ఉండగా.. కుల్దీప్ యాదవ్కు తొలి రెండు మ్యాచ్ల్లో అవకాశం దక్కలేదు.