పాండిచ్చేరి క్రికెట్ అసోసియేషన్(సీఏపీ) అండర్ 19 హెడ్ కోచ్ ఎస్ వెంకటరామన్పై ముగ్గురు సీనియర్ క్రికెటర్లు దాడి చేశారు. జట్టు ఎంపికలో తమకు అన్యాయం చేశారనే భావనతో ఈ దాడికి పాల్పిడినట్లు తెలుస్తోంది. సోమవారం జరిగిన ఈ ఘటనలో కోచ్ వెంకటరామన్ తలకు గాయం కాగా.. భుజం విరిగిందని సేదరపేట పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఎస్ రాజేష్ తెలిపారు.
వెంకటరామన్ నుదిటిపై 20 కుట్లు పడ్డాయని, ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని చెప్పారు. ప్రస్తుతం జరుగుతున్న దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీకి స్థానిక ఆటగాళ్లను ఎంపిక చేయలేదనే కోపంతో ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది.
ఓ జాతీయ మీడియా కథనం ప్రకారం.. పాండిచ్చేరి స్థానిక క్రికెటర్లకు జట్టు ఎంపికలో అన్యాయం జరుగుతుందని, ఫేక్ బర్త్ సర్టిఫికేట్స్, విద్య ధృవీకరణ పత్రాలు, ఆధార్ చిరునామాలతో ఇతర రాష్ట్రాల క్రికెటర్లను స్థానికులుగా ఆడిస్తారనే ఆరోపణలు ఉన్నాయి. 2021 నుంచి రంజీ ట్రోఫీలో కేవలం ఐదుగురు లోకల్ ప్లేయర్స్ మాత్రమే పాండిచ్చేరి జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2025కి ఎంపిక చేయడంతో ముగ్గురు సీనియర్ ఆటగాళ్లు వెంకటరామన్పై దాడి చేసినట్లు తెలుస్తోంది.

ఈ దాడిపై కోచ్ వెంకటరామన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 'గత సోమవారం(డిసెంబర్ 8) ఉదయం 11 గంటలకు నేను సీఏపీ క్యాంపస్లో ఇండో నెట్స్లో ఉండగా.. పాండిచ్చేరి సీనియర్ ఆటగాళ్లు అయిన కార్తికేయన్ జయసుందరం, అరవిందరాజ్, సంతోష్ కుమరన్ వచ్చి నాతో దుర్భాషలాడారు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీకి తమను ఎందుకు ఎంపిక చేయలేదని గొడవ పెట్టుకున్నారు. అరవిందరాజ్ నన్ను పట్టుకోగా.. కార్తికేయన్, సంతోష్ బ్యాట్తో నాపై దాడి చేశారు. పాండిచ్చేరి క్రికెటర్స్ ఫోరం కార్యదర్శి జీ చంద్రన్ సూచనలతోనే వారు ఈ దాడి చేశారు.'అని వెంకటరామన్ తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.
అయితే ఈ ఆరోపణలను పాండిచ్చేరి క్రికెటర్స్ ఫోరం అధ్యక్షుడు సెంథిల్ కుమారన్ ఖండించారు. దాడి వెనుక తన పాత్ర లేదని స్పష్టం చేశారు. 'వెంకటరామన్కు అనేక కేసులు నమోదు అయిన చరిత్ర ఉంది. అతను లోకల్ ప్లేయర్లతో అభ్యంతకరమైన భాషను వాడుతూ దురుసుగా ప్రవర్తిస్తాడు. గత ఏడేళ్లుగా పాండిచ్చేరి క్రికెట్ అసోసియేషన్లో ఉన్న సమస్యలను మేం పదే పదే బీసీసీఐ దృష్టికి తీసుకెళ్లాం. చంద్రన్పై అతనికి ఉన్న ద్వేషం కూడా అందరికి తెలిసిందే.'అని సెంథిల్ కుమారన్ పేర్కొన్నారు. ఈ దాడి ఘటనపై బీసీసీఐ ఆగ్రహం వ్యక్తం చేసింది. నిందితులను కఠినంగా శిక్షిస్తామని బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా మీడియాకు తెలిపారు.