ఆసియా కప్ 2025 టోర్నీలో విజేతగా నిలిచిన టీమిండియా టైటిల్ స్వీకరించకుండా తప్పు చేసిందని సౌతాఫ్రికా క్రికెట్ దిగ్గజం ఏబీ డివిలియర్స్ అన్నాడు. ట్రోఫీ అందజేసేవారి విషయంలో టీమిండియా అసంతృప్తిగా ఉండటం తనకు నచ్చేదని చెప్పాడు. క్రీడల్లో రాజకీయాలను జోక్యం చేయకూడదని సూచించాడు.
ఆసియా కప్ 2025 ఫైనల్లో పాకిస్థాన్ను చిత్తు చేసిన భారత్.. ట్రోఫీ లేకుండానే స్వదేశానికి తిరిగొచ్చింది. ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) అధ్యక్షుడిగా ఉన్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఛైర్మన్ మోహ్సిన్ నఖ్వీ.. పాకిస్థాన్ మంత్రిగా కూడా కొనసాగుతున్నాడని, ఆయన చేతుల మీదుగా ట్రోఫీని తీసుకోలేమని టీమిండియా స్పష్టం చేసింది.
మరోవైపు తన చేతుల మీదుగా ట్రోఫీ అందుకోవాలని, ఏసీసీ ప్రెసిడెంట్గా ట్రోఫీ ప్రదానం చేయడం తన హక్కు అని నఖ్వీ పట్టుబట్టాడు. చివరకు ట్రోఫీ అందుకోవడానికి భారత్ ముందుకు రాకపోవడంతో నఖ్వీ దాన్ని తీసుకోని వెళ్లిపోయాడు. భారత ఆటగాళ్లు ఊహాజనిత ట్రోఫీతో సంబరాలు చేసుకున్నారు. ట్రోఫీ పట్టుకెళ్లిన నఖ్వీ తీరుపై బీసీసీఐ ఆగ్రహం వ్యక్తం చేసింది. ట్రోఫీ అతని సొత్తు కాదని మండిపడింది. ఐసీసీకి ఫిర్యాదు చేసేందుకు కూడా సిద్దమైంది.

తాజాగా తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా ఈ వ్యవహారంపై స్పందించిన ఏబీ డివిలియర్స్.. భారత్ తీరును పరోక్షంగా తప్పుబట్టాడు. నేరుగా విమర్శించకుండా రాజకీయాలు చేయవద్దని సూచించాడు. 'ఆసియా కప్ ట్రోఫీ అందజేసేవారి విషయంలో టీమిండియా కొంత అసంతృప్తిగా ఉంది. అయితే క్రీడల్లో రాజకీయాలను జోక్యం చేయకూడదని నేను భావిస్తున్నా. క్రీడలకు ఎప్పుడూ రాజకీయాలు దూరంగా ఉండాలి. క్రీడ అనేది ఒక అంశం, అది ఎలా ఆడాలో అలానే ఆడాలి. భారత్ ట్రోఫీ అందుకోకపోవడం బాధగా అనిపించింది. కానీ భవిష్యత్తులో ఈ సమస్యలన్నీ పరిష్కరించుకుంటారని ఆశిస్తున్నా.
ఇలాంటి పరిస్థితులు ఆటను, ఆటగాళ్లను చాలా క్లిష్ట పరిస్థితుల్లోకి నెట్టేస్తాయి. ఇలాంటి పరిస్థితులు చూడటం నాకు ఏ మాత్రం ఇష్టం ఉండదు. ఆసియా కప్ ఫైనల్ తర్వాత చాలా ఇబ్బందికర పరిస్థితి నెలకొంది. మనం అత్యంత ముఖ్యమైన క్రికెట్పైనే ఫోకస్ పెడదాం. భారత్ జట్టు చాలా బలంగా కనిపిస్తోంది. టీ20 ప్రపంచకప్ కోసం సన్నదమవుతుంది. ఈ టోర్నీ మరీ అంత దూరం లేదు. భారత జట్టులో చాలా ప్రతిభ కలిగిన ఆటగాళ్లు ఉన్నట్లు తెలుస్తోంది. వారు క్లిష్టపరిస్థితుల్లో బాగా ఆడుతారు. కాబట్టి టీ20ల్లో టీమిండియాకు తిరుగులేదు.'అని ఏబీ డివిలియర్స్ చెప్పుకొచ్చాడు.