
న్యూఢిల్లీ: తండ్రి కాబోతున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి భారత ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. గురువారం 70వ జన్మదినం జరుపుకున్న భారత ప్రధానికి సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ కూడా మోదీకి బర్త్డే విషెస్ చెప్పాడు.
'గౌరవనీయులపై మా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారికి జన్మదిన శుభాకాంక్షలు'అని కోహ్లీ ట్వీట్ చేశాడు. ఇక విరాట్ విషెస్పై ప్రధాని స్పందిస్తూ ధన్యవాదాలు తెలిపారు. అదే విధంగా తండ్రి కాబోతున్న భారత కెప్టెన్కు విషెస్ చెప్పారు. 'ధన్యవాదాలు కోహ్లీ. నేను కూడా నిన్ను, అనుష్క శర్మను అభినందించాలనుకుంటున్నా. ఖచ్చితంగా మీరు మంచి పేరెంట్స్ అవుతారు.'అని మోదీ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్లు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి.

ఇక గత నెల 27న విరాట్ తాను తండ్రి కాబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన విషయం తెలిసిందే. గర్భంతో ఉన్న విరుష్క ఫొటోకు 'జనవరిలో మేం ముగ్గురం కాబోతున్నాం'అనే క్యాప్షన్ పేర్కొన్నాడు. ప్రస్తుతం కోహ్లీ ఐపీఎల్ 2020 సీజన్ కోసం యూఏఈకి వెళ్లగా.. అనుష్క కూడా అతని వెంట అక్కడికి వెళ్లింది.
ఈ కారణంతోనే విరాట్.. జట్టుతో కాకుండా ప్రత్యేక విమానంలో దుబాయ్ చేరాడు. ఇక కోహ్లీ తండ్రి అయ్యే సమయానికి ఆస్ట్రేలియాలో ఉండనున్నాడు. ఇక విరాట్ నేతృత్వంలోని ఆర్సీబీ సెప్టెంబర్ 21న సన్ రైజర్స్ హైదరాబాద్తో జరిగే మ్యాచ్లో ఐపీఎల్ 2020 సీజన్ జర్నీని ప్రారంభించనుంది. ఈ సారైనా టైటిల్ అందుకోవాలని ఉవ్విళ్లూరుతోంది.