World Cup 2023 Final: వన్డే ప్రపంచకప్ చరిత్రలో టీమిండియా నాలుగోసారి ఫైనల్కు చేరింది. గత రెండు టోర్నీల్లో సెమీఫైనల్కే పరిమితమైన టీమిండియా.. ఈ సారి మరో అడుగు ముందుకేసింది. బుధవారం వాంఖడే మైదానం వేదికగా జరిగిన తొలి సెమీఫైనల్లో భారత్ 70 పరుగుల తేడాతో న్యూజిలాండ్ను చిత్తు చేసింది.
ఈ గెలుపుతో గత ప్రపంచకప్లో ఇదే న్యూజిలాండ్ చేతిలో సెమీస్ పోరులో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. గత 10 ఏళ్లుగా అందని ద్రాక్షగా ఉన్న ఐసీసీ టైటిల్ అందుకోవడానికి టీమిండియా అడుగు దూరంలో నిలిచింది. ఆదివారం వరల్డ్ బిగ్గెస్ట్ స్టేడియం అయిన నరేంద్ర మోదీ మైదానం వేదికగా జరిగే టైటిల్ ఫైట్లో అమీతుమీ తేల్చుకునేందుకు టీమిండియా సిద్దమవుతోంది.

అయితే ఈ ప్రపంచకప్ 2023 ఫైనల్ మ్యాచ్కు భారత ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆయనతో పాటు పలువురు కేంద్రమంత్రులు, భారత మాజీ క్రికెటర్లు, వివిధ రంగాల సెలబ్రిటీలు ఈ హై ఓల్టేజ్ మ్యాచును చూసేందుకు రానున్నారు. ప్రధాని రాకపై ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోయినా.. బీజేపీ వర్గాలు ప్రధాని మ్యాచ్కు వస్తారని ప్రచారం చేస్తున్నాయి.
ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీమిండియా ఒక్క ఐసీసీ టైటిల్ కూడా గెలవలేదు. గత 9 ఏళ్లలో టీమిండియా తొలిసారి వన్డే ప్రపంచకప్ ఫైనల్కు చేరింది. ఈ సారి అసాధారణ ప్రదర్శన కనబరుస్తున్న టీమిండియా.. లక్షా 30 వేల సీటింగ్ కెపాసిటీ కలిగిన అహ్మదాబాద్ మైదానంలో టైటిల్ అందుకుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
ఈ క్రమంలోనే దేశ ప్రధాని నరేంద్ర మోదీ మ్యాచ్కు హాజరై దగ్గరుండి టీమిండియాను గెలిపిస్తారని బీజేపీ శ్రేణులు కామెంట్ చేస్తున్నారు. ఇక టీమిండియా విజయంపై సంతోషం వ్యక్తం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియా వేదికగా జట్టను ప్రశంసించారు.
'భారత జట్టుకు అభినందనలు. అత్యుత్తమ ప్రదర్శనతో ఫైనల్స్లో అడుగుపెట్టింది. అద్భుతమైన బ్యాటింగ్, మంచి బౌలింగ్ మన జట్టుకు అసాధారణ విజయాన్ని అందించింది. ఫైనల్ మ్యాచ్కు శుభాకాంక్షలు.'అని ట్వీట్ చేశారు.

ఇక 50 శతకాలు సాధించిన విరాట్ కోహ్లీ, ఏడు వికెట్లతో సత్తా చాటిన మహమ్మద్ షమీని కూడా ప్రధాని మోదీ కొనియాడారు. 'ఈ రోజు విరాట్ కోహ్లీ తన 50వ వన్డే శతకాన్ని సాధించాడు. ఆటమీద అతనికి ఉన్న అంకిత భావం, పట్టుదల ఏంటో ఈ రికార్డ్ ద్వారా అర్థమవుతోంది. ఈ అసాధారణమైన మైలు రాయి అతని నిరంతర అంకిత భావానికి, అద్భుత ప్రతిభకు నిదర్శనం. కోహ్లీకి నా హృదయపూర్వక అభినందనలు. భవిష్యత్ తరాలకు అతను మార్గదర్శకంగా ఉంటాడు.
బౌలింగ్లో అత్యద్భుత ప్రదర్శన కనబర్చిన షమీకి అభినందనలు. ఈ మ్యాచ్లో ఎంతో గొప్పగా బౌలింగ్ చేశాడు. ఈ ప్రపంచకప్ ద్వారా షమీని క్రికెట్ అభిమానులు, భవిష్యత్ తరాలు ఎంతో ఆదరిస్తాయి.'అని మోదీ వరుస ట్వీట్లు చేశారు.