యావత్ క్రికెట్ ప్రపంచం ఎంతో ఆసక్తికరంగా చూసే భారత్-పాకిస్థాన్ దాయాదుల పోరుపై ప్రధాని నరేంద్ర మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇరు జట్లలో ఏది అత్యుత్తమ జట్టు అనేది ఫలితాలే నిర్ణయిస్తాయన్నారు. బెస్ట్ టీమ్ ఏదో ప్రత్యేకంగా తాను చెప్పాల్సిన అవసరం లేదని చెప్పారు. తాజాగా ఓ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న నరేంద్ర మోదీ.. భారత్-పాక్ పోరుతో పాటు క్రీడలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా భారత్, పాకిస్థాన్ జట్లలో బెస్ట్ టీమ్ ఏది? అని ప్రశ్నించగా.. తనదైన శైలిలో సమాధానమిచ్చారు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో పాకిస్థాన్పై భారత్ విజయం సాధించిందని, ఈ ఫలితమే అత్యుత్తమ జట్టు ఏదో తెలియజేస్తుందని బదులిచ్చారు.

నేను ఎక్స్పర్ట్ కాదు..
'నేనేం క్రికెట్ ఎక్స్పర్ట్ను కాదు. ఈ గేమ్ టెక్నిక్ కూడా నాకు తెలియదు. నిపుణులు మాత్రమే ఈ విషయం చెప్పగలరు. కానీ కొద్ది రోజుల క్రితమే భారత్-పాక్ మధ్య మ్యాచ్ జరిగింది. ఆ ఫలితమే ఏ జట్టు అత్యుత్తమంగా ఉందో చెప్పింది. అది అందరికి తెలుసు. క్రీడలకు మాత్రమే ఈ ప్రపంచాన్ని ఉత్తేజపరిచే శక్తి ఉంది. వివిధ దేశాల జనాలను క్రీడలు ఒకచోటికి చేర్చుతాయి.
అందుకే నేను క్రీడలను ఎప్పుడూ తక్కువ చూపు చూడను. మానవ పరిణామంలోక్రీడలు కీలక పాత్ర పోషిస్తాయి. క్రీడలు కేవలం ఆటలు మాత్రమే కాదు. వివిధ దేశాల ప్రజల మధ్య సత్సంబంధాలు నెలకొల్పుతాయి. 'అని మోదీ తెలిపారు.
భారత్లో మినీ బ్రెజిల్..
భారత్లో ఫుట్బాల్కు ఫుల్ క్రేజ్ ఉందని మోదీ తెలిపారు. మధ్యప్రదేశ్లోని ఓ చిన్నపట్టణంలో ఫుట్బాల్కు ఉన్న ఆదరణ తనను ఆశ్చర్యానికి గురిచేసిందని చెప్పారు. 'మధ్యప్రదేశ్లో షాదోల్ అనే జిల్లా ఉంది. ఇది పూర్తిగా గిరిజనుల ప్రాంతం. ఆ కమ్యునిటీనే ఎక్కువగా ఉంటుంది. నేను అక్కడికి వెళ్లినప్పుడు 80-100 మంది యువకులు, పెద్దవాళ్లు స్పోర్ట్స్ జెర్సీల్లో కనిపించారు. నేను వారిని చూసి ఎక్కడి నుంచి వచ్చారని అడిగాను. అందుకు వారు మినీ బ్రెజిల్ అని బదులిచ్చారు.
నేను కాస్త వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేశాను. 'మా గ్రామంలో నాలుగు తరాలుగా ఫుట్బాల్ ఆడుతున్నారు. మా ఊరి నుంచి సుమారు 80 మంది జాతీయ స్థాయిలో ఆడారు. మా గ్రామం పూర్తిగా ఫుట్బాల్కు అంకితం'అని చెప్పారు. వారి ఊరిలో జరిగే వార్షిక ఫుట్ బాల్ మ్యాచ్కు ఇతర గ్రామాలు, జిల్లాల నుంచి 20 వేల నుంచి 25 వేల మంది ప్రేక్షకులు హాజరవుతారని తెలిపారు.'అని మోదీ చెప్పుకొచ్చారు.
ఆయనే నా ఫేవరేట్..
నచ్చిన ఫుట్బాల్ దిగ్గజం ఎవరని మోదీని ప్రశ్నించగా.. డియెగో మారడోనా అని తెలిపారు. '1980లో ఫుట్బాల్ ప్రపంచాన్ని మరడోనా శాసించారు. ఆ జనరేషన్కు ఆయనే హీరో. ఈ జనరేషన్ను అడిగితే లియోనల్ మెస్సీ పేరు చెబుతారు.'అని మోదీ బదులిచ్చారు.