రాజస్థాన్ రాయల్స్ చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీపై భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసల జల్లు కురిపించారు. చిన్న వయసులో సూర్యవంశీ అసాధారణ ప్రదర్శన కనబరుస్తున్నాడని కొనియాడారు. బీహార్ వేదికగా జరగనున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్ను నరేంద్ర మోదీ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వైభవ్ సూర్యవంశీ గురించి ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. ఐపీఎల్లో వైభవ్ 35 బంతుల్లో సాధించిన సెంచరీని ప్రస్తావిస్తూ ప్రశంసల జల్లు కురిపించారు.
'ఐపీఎల్లో బిహార్కు చెందిన వైభవ్ సూర్యవంశీ ఆటను చూశాను. అతను అసాధారణ ప్రదర్శన కనబర్చాడు. ఇంత చిన్న వయసులో ఇంత పెద్ద రికార్డ్ సాధించడం గొప్ప విషయం. అతని ఆట వెనుక ఎంతో కష్టం ఉంది. వివిధ స్థాయిల్లో మ్యాచ్లు ఆడటం వైభవ్కు సహాయపడింది. ఎవరైతే ఎంత ఎక్కువగా ఆడుతారో.. వారు ఎక్కువగా రాణిస్తారు. ఎన్డీఏ ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తోంది.

మన అథ్లెట్లకు కొత్త క్రీడలు ఆడేందుకు అవకాశాలు కల్పించడంపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో గట్కా, ఖోఖో, మల్కాంబ్, యోగాసన అనే కొత్త క్రీడలను చేర్చారు. ఇటీవల అథ్లెట్లు కొత్త క్రీడల్లో మెరుగైన ప్రదర్శన చేస్తున్నారు. వుషు, లాన్ బాల్స్, రోలర్ స్కేటింగ్ వంటి క్రీడల్లో సత్తా చాటుతున్నారు.
దేశంలో కొత్త విద్య విధానాన్ని తీసుకొచ్చాం. ఈ పాలసీ ద్వారా విద్యలో క్రీడలను భాగం చేసాం. దేశంలో మంచి ఆటగాళ్లతో పాటు అద్భుతమైన క్రికెట్ ఎక్స్పర్ట్స్ను తయారు చేయడమే ఈ పాలసీ లక్ష్యం. జీవితంలో ప్రతీ అంశంలో క్రీడా స్ఫూర్తి కీలకమైన పాత్ర పోషిస్తుందని మాకు తెలుసు. క్రీడల ద్వారా టీమ్ వర్క్ నేర్చుకుంటాం. కలిసి కట్టుగా ముందుకు వెళ్లడం ఎలాగో తెలుసుకుంటాం.'అని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు.
ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2025 మే 4 నుంచి 15 వరకు బీహార్, న్యూఢిల్లీ వేదికగా జరగనున్నాయి. బెంగళూరులోని పాట్నా, రాజ్గిర్, గయ, భగల్పూర్, బెగుసరాయ్లు ఈ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. షూటింగ్, జిమ్నాస్టిక్స్, ట్రాక్ సైక్లింగ్ ఈవెంట్స్ ఢిల్లీ వేదికగా జరగనున్నాయి.