వన్డే ప్రపంచకప్ 2025 గెలిచిన భారత మహిళల జట్టును ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. బుధవారం తన నివాసంలో ప్రపంచకప్ గెలిచిన భారత మహిళల జట్టు సభ్యులతో పాటు హెడ్ కోచ్ అమోల్ ముజుందార్తో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమై ప్రపంచకప్ విశేషాలను చర్చించారు.
47 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించిన హర్మన్సేనను ప్రధాని అభినందించారు. ఈ టోర్నీలో వరుసగా మూడు మ్యాచ్ల్లో ఓడిన తర్వాత భారత జట్టు పుంజుకొని విజేతగా నిలిచిన తీరును మోదీ మెచ్చుకున్నారు.
సొంతగడ్డపై జరిగిన మహిళల వన్డే ప్రపంచకప్ 2025ను హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత జట్టు గెలుచుకున్న సంగతి తెలిసిందే. నవీముంబై వేదికగా ఆదివారం జరిగిన ఫైనల్లో సౌతాఫ్రికాను 52 పరుగుల తేడాతో ఓడించి చిరకాల కోరికను నేరవేర్చుకుంది. ఈ విజయానికి ఫిదా అయిన మోదీ.. భారత మహిళల జట్టుకు ఆహ్వానం పంపారు. ఈ మేరకు భారత మహిళల జట్టు ప్రధాని నివాసంలో బుధవారం ఆయనతో సమావేశమైంది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, భారత ఆటగాళ్లు ప్రపంచకప్ ట్రోఫీతో కలిసి ఫొటోలకు ఫోజిచ్చారు.

అనంతరం భారత ఆటగాళ్లతో మోదీ ముచ్చటించారు. ఫైనల్ బంతిని హర్మన్ ప్రీత్ కౌర్ జేబులో వేసుకోవడం గురించి మోదీ ప్రస్తావించగా.. అదృష్టవశాత్తు బంతి తన దగ్గరకు వచ్చిందని ఆమె బదులిచ్చింది. 2021లో ఇంగ్లండ్పై హర్లీన్ డియోల్ అందుకున్న క్యాచ్ను కూడా ప్రధాని గుర్తు చేశారు. మోదీని కలవడం కోసం 2017 నుంచి తాను ఎదురు చూస్తున్నానని దీప్తి శర్మ తెలిపింది. కలను సాకారం చేసుకోవడం కోసం కష్టపడుతూనే ఉండాలని మోదీ చెప్పిన మాటలను గుర్తు చేసుకున్నారు.
ఫిట్ ఇండియా సందేశాన్ని వ్యాప్తి చేయాలని ఈ సందర్భంగా క్రికెటర్లను మోదీ కోరారు. దేశం ఊబకాయ సమస్య పెరిగిపోతుండడంపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. స్కూళ్లకు వెళ్లి క్రీడలను ఎంచుకునేలా యువతకు ప్రోత్సాహాన్నివ్వాలని మోదీ సూచించారు. జట్టు సభ్యులంతా సంతకాలు చేసిన జెర్సీని కెప్టెన్ హర్మన్ప్రీత్ ప్రధానికి బహూకరించింది.