ఆసియా కప్ 2025 టోర్నీలో భాగంగా పాకిస్థాన్తో జరిగిన ఫైనల్లో టీమిండియా విజయం సాధించడంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ సంతోషం వ్యక్తం చేశారు. మైదానంలో భారత ఆటగాళ్ల పోరాటాన్ని కొనియాడుతూ ట్వీట్ చేశారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఆపరేషన్ తిలక్ అనే అర్థం వచ్చేలా ట్వీట్లో పేర్కొన్నారు.'క్రీడా మైదానంలోనూ ఆపరేషన్ సిందూర్.. ఫలితం మాత్రం మారలేదు. భారత్దే గెలుపు. మన క్రికెటర్లకు అభినందనలు'అని మోదీ తన ట్వీట్లో రాసుకొచ్చారు.
ఆదివారం ఉత్కంఠగా సాగిన ఫైనల్లో టీమిండియా 5 వికెట్ల తేడాతో పాకిస్థాన్ను ఓడించింది. స్టార్ బ్యాటర్, తెలుగు తేజం తిలక్ వర్మ(53 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్లతో 69 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో టీమిండియాకు చిరస్మరణీయమైన విజయాన్నందించాడు. 20 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ జట్టును తిలక్ వర్మ ఆదుకున్నాడు. సంజూ శాంసన్, శివమ్ దూబే, తిలక్ వర్మ సాయంతో టీమిండియాకు విజయ తిలకం దిద్దాడు.

ఈ గెలుపుతో ఆసియా కప్లో టీమిండియా 9వ టైటిల్ను సొంతం చేసుకుంది. పాకిస్థాన్పై ఈ టోర్నీలో వరుసగా మూడో విజయాన్నందుకుంది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 19.1 ఓవర్లలో 146 పరుగులకు కుప్పకూలింది. సహిబ్జాద ఫర్హాన్(38 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్లతో 57) హాఫ్ సెంచరీతో చెలరేగగా.. ఫకార్ జమాన్(35 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 46) తృటిలో అర్థశతకాన్ని చేజార్చుకున్నాడు. మిగతా బ్యాటర్లలో సైమ్ అయుబ్(14) మినహా మరే బ్యాటర్ డబుల్ డిజిట్ స్కోర్ చేయలేదు. కుల్దీప్ యాదవ్(4/30)నాలుగు వికెట్లతో పాకిస్థాన్ పతనాన్ని శాసించగా.. వరుణ్ చక్రవర్తీ(2/30), అక్షర్ పటేల్(2/26), జస్ప్రీత్ బుమ్రా(2/25) రెండేసి వికెట్లు పడగొట్టారు.
అనంతరం భారత్ 19.4 ఓవర్లలో 5 వికెట్లకు 150 పరుగులు చేసి గెలుపొందింది. తిలక్ వర్మ అజేయ హాఫ్ సెంచరీకి తోడుగా.. శివమ్ దూబే(22 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 33), సంజూ శాంసన్(21 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్తో 24) రాణించారు. పాకిస్థాన్ బౌలర్లలో ఫహీమ్ అష్రఫ్(3/29) మూడు వికెట్లు తీయగా.. షాహిన్ షా అఫ్రిది, అబ్రర్ అహ్మద్ తలో వికెట్ తీసారు.