సౌతాఫ్రికాతో తొలి టెస్ట్లో టీమిండియాకు ఎదురైన ఓటమి నేపథ్యంలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గంభీర్ అనాలోచిత నిర్ణయాల కారణంగానే టీమిండియా విజయాలు అందుకోలేకపోతుందని అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లు మండిపడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా గంభీర్పై విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా ఈ జాబితాలోకి టీమిండియా మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ చేరాడు.
నేరుగా గంభీర్పై విమర్శలు చేయకపోయినా.. టీమిండియా మేనేజ్మెంట్ కారణంగానే ఘోర పరాజయాలను ఎదుర్కొంటుందని అభిప్రాయపడ్డాడు. ముఖ్యంగా జట్టు వాతావరణం దెబ్బతిన్నదని, టీమ్లో ఒక్క ప్లేయర్ కూడా స్వేచ్ఛగా ఆడలేకపోతున్నారని ఆరోపించాడు. జట్టులో పదే పదే మార్పులు చేయడంతో ఆటగాళ్ల ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతుందని తెలిపాడు. ఏ ఒక్క ప్లేయర్కు కూడా టీమ్ మేనేజ్మెంట్ నుంచి మద్దతు లభించడం లేదన్నాడు.

'జట్టులో ఎవరు ఆడినా.. వారికి టీమ్ మేనేజ్మెంట్ మద్దతు ఉందనే భావనలో లేరు. ఒక్కరు కూడా ఆటగాళ్లను వెనకేసుకొని రావడం లేదు. జట్టులో ప్రతీ ఒక్కరు భయంతో ఉన్నారు. జట్టులో చోటు ఉంటుందో లేదోననే భయంతోనే ఆడుతున్నారు. ఒక్కరు కూడా స్వేచ్ఛగా ఆడటం లేదు.
సర్ఫరాజ్ ఖాన్ సెంచరీ చేసిన తర్వాత కూడా జట్టులో అతని చోటు ఖరారు కాలేదు. సెంచరీ తర్వాత అతను తిరిగి జట్టులోకి కూడా రాలేకపోయాడు. సాయి సుదర్శన్ 87 పరుగులు చేశాడు. అతను కూడా తదుపరి మ్యాచ్ ఆడలేదు. జట్టు అంతా గందరగోళంలో ఉంది.'అని తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా మహమ్మద్ కైఫ్ చెప్పుకొచ్చాడు.
ఆటగాళ్లకు వరుసగా అవకాశాలు ఇచ్చి, వెన్ను తట్టి ప్రోత్సహించాలని కైఫ్ సూచించాడు. అప్పుడే ఆటగాళ్లు ఎలాంటి బెరుకు లేకుండా స్వేచ్ఛగా ఆడగలరని అభిప్రాయపడ్డాడు. ఇలా చేస్తేనే టీమిండియాకు ఆశించిన ఫలితాలు దక్కుతాయని చెప్పాడు. కోల్కతా వేదికగా జరిగిన తొలి టెస్ట్లో టీమిండియా 30 పరుగుల తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. 124 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా ఛేదించలేకపోయింది. పూర్తిగా బౌలింగ్కు అనుకూలంగా ఉన్న పిచ్ను సిద్దం చేయడంతో భారత బ్యాటర్లు తడబడ్డారు. ఈ తరహా పిచ్ను తానే తయారు చేయించానని గంభీర్ అంగీకరించాడు. దాంతో అతనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.