ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 12లో తెలుగు టైటాన్స్ దుమ్మురేపుతోంది. వరుసగా ఐదో విజయాన్ని నమోదు చేసింది. బుధవారం జరిగిన మ్యాచ్లో తెలుగు టైటాన్స్ 46-29 తేడాతో హర్యానా స్టీలర్స్ను చిత్తు చేసింది. ఆల్రౌండర్ భరత్ 20 పాయింట్లతో సత్తా చాటగా.. మరో ఆల్రౌండర్ కమ్ కెప్టెన్ విజయ్ మాలిక్ 8 పాయింట్స్తో రాణించాడు. హర్యానా స్టీలర్స్లో మయాంక్ సైనీ(5), జైదీప్(4), వినయ్(4) రాణించారు.
ఈ మ్యాచ్ ఆరంభం నుంచి తెలుగు టైటాన్స్ దుమ్మురేపింది. ఫస్టాఫ్లో ప్రత్యర్థిని రెండు సార్లు ఆలౌట్ చేసి 26-16తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. సెకండాఫ్లోనూ తెలుగు టైటాన్స్ అదే జోరును కొనసాగించింది. హర్యానాను మరోసారి ఆలౌట్ చేసింది.

ఆఖరి వరకు ఆధిక్యాన్ని కొనసాగించి సునాయస విజయాన్నందుకుంది. ఇప్పటి వరకు 13 మ్యాచ్లు ఆడిన తెలుగు టైటాన్స్ 8 విజయాలు సాధించింది. పాయింట్స్ టేబుల్లో మూడో స్థానంలో కొనసాగుతోంది. ఇదే జోరును కొనసాగిస్తే.. తెలుగు టైటాన్స్ ఈజీగా ప్లేఆఫ్స్కు అర్హత సాధిస్తోంది.
లీగ్ దశలో ప్రతీ జట్టు 18 మ్యాచ్లు ఆడనున్నాయి. తెలుగు టైటాన్స్ తమ చివరి ఐదు మ్యాచ్ల్లో మూడు గెలిచినా ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కించుకుంటుంది.
ఈ సారి ప్లే ఆఫ్స్ సమరం భిన్నంగా ఉండనుంది. గతంలో నాలుగు జట్లు మాత్రమే ప్లే ఆఫ్స్కు అర్హత సాధించేవి. కానీ ఈసారి 8 జట్లు ప్లే ఆఫ్స్ చేరనున్నాయి. మొత్తం 12 జట్లతో లీగ్ దశ ముగిసిన తర్వాత టాప్-8లో నిలిచిన జట్లు ప్లే ఆఫ్స్ చేరుతాయి. తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు నేరుగా క్వాలిఫయర్-1 ఆడుతాయి. ఇందులో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్ చేరుతుంది. ఓడిన జట్టుకు క్వాలిఫయర్-2 రూపంలో మరో అవకాశం లభిస్తోంది.
ఐదు, 8వ స్థానం సాధించిన జట్ల మధ్య, 6వ, 7వ స్థానంలో నిలిచి నిలిచిన జట్ల మధ్య ప్లే ఇన్ మ్యాచ్లు ఆడిస్తారు. ఈ రెండు మ్యాచ్ల్లో విజేతలు ఎలిమినేటర్-1 ఆడుతాయి. ఎలిమినేటర్ 1 విజేత ఎలిమినేటర్-2 అర్హత సాధిస్తాయి. 3, 4 స్థానాల్లో నిలిచిన జట్లు మినీ క్వాలిఫయర్లో ఆడుతాయి. విజేత ఎలిమినేటర్కు అర్హత సాధిస్తుంది. ఓడిన జట్టు ఎలిమినేటర్ -2 ఆడుతుంది. ఎలిమినేటర్-2 విజేత ఎలిమినేటర్ 3కి వస్తుంది. ఎలిమినేటర్ 3 విజేత క్వాలిఫయర్-2 ఆడుతుంది. క్వాలిఫయర్-2 విజేత ఫైనల్కు చేరుతుంది.
మరో మ్యాచ్లో పుణేరి పల్టాన్ 37-27 తేడాతో యు ముంబాను ఓడించింది. పుణేరి పల్టాన్ తరఫున ఆదిత్య షిండే(14), అస్లామ్(5) సత్తా చాటగా.. యుముంబా తరఫున సందీప్(7) ఒక్కడే రాణించాడు.