ప్రోకబడ్డీ ప్రీమియర్ లీగ్(పీకేఎల్) సీజన్ 11 ప్లే ఆఫ్స్ రేసు నుంచి తెలుగు టైటాన్స్ తప్పుకుంది. ప్లే ఆఫ్స్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో యు ముంబా అద్భుత విజయం సాధించింది. మంగళవారం జరిగిన మ్యాచ్లో యు ముంబా 36-27 తేడాతో బెంగాల్ వారియర్స్ను ఓడించింది.
మ్యాచ్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన యు ముంబా ఫస్టాఫ్లో ప్రత్యర్థిని ఒకసారి ఆలౌట్ చేసి విరామ సమయానికి 18-10తో ఆధిక్యంలో నిలిచింది. సెకండాఫ్లో బెంగాల్ వారియర్స్ పుంజుకున్నా.. యు ముంబా తమ ఆధిక్యాన్ని కాపాడుకొని విజయం సాధించింది. సెకండాఫ్లో ఇరు జట్లు చెరోసారి ఆలౌటయ్యాయి. యు ముంబా తరఫున జఫర్దానెష్(7), కెప్టెన్ సునీల్ కుమార్(5), అజిత్ చౌహన్(6) సత్తా చాటారు. బెంగాల్ వారియర్స్ తరఫఉన ప్రణయ్ రానే(12) రాణించినా ఫలితం దక్కలేదు.

ఈ గెలుపుతో యు ముంబా 22 మ్యాచ్ల్లో 12 విజయాలు 2 టైలతో ఆరో స్థానంలో నిలిచి ప్లే ఆఫ్స్ చేరింది. మరోవైపు తెలుగు టైటాన్స్ కూడా 22 మ్యాచ్ల్లో 12 విజయాలు సాధించింది. కానీ తెలుగు టైటాన్స్ ఒక్క టై కూడా లేకపోవడంతో.. పాయింట్స్ తేడా కూడా తక్కువగా ఉండటంతో ప్లే ఆఫ్స్ చేరలేకపోయింది. బెంగాల్ వారియర్స్ చేతిలో 7 పాయింట్స్ తేడాతో ఓడిపోయి ఉంటే తెలుగు టైటాన్స్కు అవకాశం ఉండేది.
పీకేఎల్ ఫ్లే ఆఫ్స్ ఫార్మాట్ ఏంటంటే..?
ఇతర టోర్నీలతో పోల్చితే ప్రోకబడ్డీ లీగ్ ప్లే ఆఫ్స్ ఫార్మాట్ విభిన్నంగా ఉంటుంది. ఈ టోర్నీలో మొత్తం 6 జట్లు ప్లే ఆఫ్స్ చేరుతాయి. టాప్-2లో నిలిచిన జట్లు నేరుగా సెమీఫైనల్-1 , సెమీఫైనల్-2 చేరుతాయి. తర్వాతి నాలుగు జట్లు ఎలిమినేటర్-1, ఎలిమినేటర్-2 మ్యాచ్లు ఆడుతాయి. ఎలిమినేటర్-1లో గెలిచిన జట్టు సెమీఫైనల్-1, ఎలిమినేటర్-2లో గెలిచిన జట్టు సెమీఫైనల్-2 ఆడుతాయి.
టాప్-2లో నిలిచిన హర్యానా స్టీలర్స్, దబాంగ్ ఢిల్లీ సెమీఫైనల్ చేరగా.. యూపీ యోధాస్, పట్నా పైరేట్స్ ఎలిమినేటర్ 1, జైపూర్ పింక్ పాంథర్స్, యు ముంబా ఎలిమినేటర్-2 ఆడనున్నాయి. డిసెంబర్ 26 నుంచి నాకౌట్ మ్యాచ్లు ప్రారంభం కానున్నాయి.