ఆస్ట్రేలియాతో ఐదు టెస్ట్ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా అడిలైడ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్లో టీమిండియా తడబడింది. డే/నైట్ పింక్ బాల్తో జరుగుతున్న ఈ మ్యాచ్ తొలి రోజు భారత బ్యాటర్లు, బౌలర్లు తేలిపోయారు. దాంతో ఆతిథ్య ఆస్ట్రేలియా పూర్తి ఆధిపత్యం చెలాయించింది. అయితే టీమిండియాకు పింక్ బాల్తో ఆడిన అనుభవం ఎక్కువగా లేకపోవడంతోనే తడబడినట్లు క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
2015లో డే/నైట్ టెస్ట్లను ప్రారంభించగా.. ఈ మ్యాచ్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన పింక్ బాల్ను ఉపయోగిస్తున్నారు. డే/నైట్ టెస్ట్ల ప్రారంభించాలనుకున్నప్పుడు బంతిపై తీవ్ర చర్చ జరిగింది. చివరకు ప్రత్యేకంగా రూపొందించిన పింక్ బాల్ను ఉపయోగిస్తున్నారు. ఇప్పటి వరకు ఆస్ట్రేలియా 11 డే/నైట్ టెస్ట్లు ఆడగా.. భారత్ నాలుగు మాత్రమే ఆడింది.

పింక్ బాల్ vs రెడ్ బాల్..
సాధారణంగా టెస్ట్ల్లో రెడ్ బాల్ను ఉపయోగిస్తారు. డే/నైట్ టెస్ట్ల్లో మాత్రం పింక్ బాల్ను వాడుతారు. రెడ్ బాల్ కంటే పింక్ చాలా భిన్నంగా ఉంటుంది. ఫ్లడ్ లైట్ల వెలుతురులో బ్యాటర్లకు స్పష్టంగా కనబడటంతో పాటు త్వరగా బంతి చెడిపోకుండా ఉండేలా దీన్ని తయారు చేశారు. రెడ్ బాల్తో పోలిస్తే పింక్ బాల్లో ఎక్కువ లేయర్స్ ఉంటాయి.
రెడ్ బాల్ సీమ్ నల్లటి దారంతో ఉంటే.. పింక్ బాల్ సీమ్ తెల్లని దారంతో ఉంటుంది. పింక్ బాల్ కలర్ కోసం పాలియురేతిన్ అనే పదార్థాన్ని ఉపయోగిస్తారు. రెడ్ బాల్ కొత్తగా ఉన్నప్పుడు మాత్రమే స్వింగ్ అవుతుంది. కానీ పింక్ బాల్ మాత్రం 40 ఓవర్ల వరకు స్వింగ్ అవుతోంది. రాత్రి సమయంలోనూ బౌలర్లకు అడ్వాంటేజ్గా ఉంటుంది.
తేమ వచ్చినా కూడా పింక్ బాల్ బౌలర్లకు, ఫీల్డర్లకు పట్టుచిక్కుతుంది. కానీ రెడ్ బాల్ తేమతో తడిచి జారిపోతుంది. ఎక్కువ లేయర్స్ ఉండటం వల్ల పింక్ బాల్ ఆకారం త్వరగా దెబ్బతినదు. బౌలర్లకు అనుకూలంగా ఉంటుంది. పింక్ బాల్ పేసర్లకు అనుకూలంగా ఉన్నా.. స్పిన్నర్లకు మాత్రం పెద్దగా సహకరించదు.
తాజా మ్యాచ్లో ఆఫ్ స్పిన్నర్లు నాథన్ లయన్, అశ్విన్ పింక్ బాల్తో పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. ఈ తేడాల నేపథ్యంలోనే పింక్ బాల్ మ్యాచ్ అటు బ్యాటర్లకు, ఇటు బౌలర్లకు సవాల్గా ఉంటుంది. భారత జట్టుకు పింక్ బాల్తో ఆడిన అనుభవం ఎక్కువగా లేకపోవడం.. బంతి పని తీరును పూర్తిగా అర్థం చేసుకోకపోవడంతోనే తడబడుతున్నారని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఆసీస్దే ఆధిపత్యం..
తాజాగా జరుగుతున్న పింక్ బాల్ మ్యాచ్లో తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఫస్ట్ ఇన్నింగ్స్లో ఆసీస్ 33 ఓవర్లలో వికెట్ నష్టానికి 86 పరుగులు చేసింది. ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా(13) విఫలమైనా.. నాథన్ మెక్స్వీనీ(97 బంతుల్లో 6 ఫోర్లతో 38 బ్యాటింగ్), మార్నస్ లబుషేన్(67 బంతుల్లో 3 ఫోర్లతో 20 బ్యాటింగ్) జిడ్డు బ్యాటింగ్తో క్రీజులో నిలబడ్డారు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రాకే ఒక వికెట్ దక్కింది. ప్రస్తుతం ఆసీస్ ఇంకా 94 పరుగుల వెనుకంజలో ఉంది.
భారత్ 180 ఆలౌట్..
అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్లో 44.1 ఓవర్లలో 180 పరుగులకు కుప్పకూలింది. తెలుగు తేజం, యువ ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి(54 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్లతో 42) దూకుడుగా ఆడగా.. కేఎల్ రాహుల్(64 బంతుల్లో 6 ఫోర్లతో 37), శుభ్మన్ గిల్(51 బంతుల్లో 5 ఫోర్లతో 31) పర్వాలేదనిపించారు. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్(6/48) ఆరు వికెట్లు తీయగా.. ప్యాట్ కమిన్స్, స్కాట్ బోలాండ్ రెండేసి వికెట్లు పడగొట్టారు.