ఆఖరి సెషన్ వరకు ఆసక్తికరంగా సాగిన లార్డ్స్ టెస్ట్ అభిమానులను ఉక్కిరి బిక్కిరి చేసింది. మ్యాచ్ ఆరంభం నుంచి నువ్వా-నేనా అన్నట్లు సాగిన ఈ మ్యాచ్.. ఆటగాళ్ల మాటల యుద్దంతో ఒక్కసారిగా వేడెక్కింది. భావోద్వేగాలను అదుపు చేసుకోలేకపోయిన ఆటగాళ్లు ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకున్నారు. కానీ మ్యాచ్ ముగిసిన తర్వాత క్రీడా స్ఫూర్తి ప్రదర్శించి అందరి మనసులను గెలుచుకున్నారు. ముఖ్యంగా ఓటమితో నేలకూలిన మహమ్మద్ సిరాజ్ను వెన్ను తట్టి ఇంగ్లండ్ ఆటగాళ్లు ఓదార్చడం సగటు క్రికెట్ అభిమానిని ఆకట్టుకుంది. అప్పటి వరకు ఒకరినొకరు తిట్టుకున్న ఆటగాళ్లు.. మ్యాచ్ ముగిసిన వెంటనే విజయం కోసం పోరాడిన సిరాజ్ను అభినందించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి. వీటిని చూసిన నెటిజన్లు ఇది కదా క్రీడా స్ఫూర్తి అంటూ కామెంట్ చేస్తున్నారు.
క్రికెట్ పుట్టినిల్లు లార్డ్స్ వేదికగా ఆద్యాంతం ఆసక్తిగా సాగిన ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. 93 పరుగుల లక్ష్యచేధనకు దిగిన టీమిండియా రెండో ఇన్నింగ్స్లో 170 పరుగులకు ఆలౌటైంది. రవీంద్ర జడేజా(181 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 61 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో చేసిన ఒంటరి పోరాటం వృథా అయ్యింది. పిచ్ నుంచి లభించిన సహకారాన్ని అందిపుచ్చుకున్న ఇంగ్లండ్ బౌలర్లు నిప్పులు చెరిగారు.

జోఫ్రా ఆర్చర్(3/55), బెన్ స్టోక్స్(3/48) మూడేసి వికెట్లు తీయగా.. బ్రైడన్ కార్స్(2/30) రెండు వికెట్లు పడగొట్టాడు. షోయబ్ బషీర్, క్రిస్ వోక్స్కు చెరో వికెట్ దక్కింది. ఈ మ్యాచ్లో టీమిండియా ఓడినా.. అభిమానుల మనసులను గెలుచుకుంది. 82 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి ఓటమి అంచున నిలిచిన జట్టును జడేజా అసాధారణ బ్యాటింగ్తో విజయం దిశగా నడిపించాడు.
కేఎల్ రాహుల్ వికెట్ అనంతరం క్రీజులోకి వచ్చిన జడేజా.. నితీష్తో పాటు 8వ వికెట్కు 30 పరుగులు .. బుమ్రాతో కలిసి 9వ వికెట్కు 35 పరుగులు జోడించాడు. ఆ తర్వాత సిరాజ్తో కలిసి ఆఖరి వికెట్కు 23 పరుగుల భాగస్వామ్యాన్ని అందించాడు. బుమ్రా 53 బంతులు ఎదుర్కోగా.. సిరాజ్ 30 బంతులను ఆడాడు. షోయబ్ బషీర్ బౌలింగ్లో దురదృష్టకర రీతిలో ఔటైన సిరాజ్.. అనంతరం నేలకూలాడు. జట్టు విజయవకాశాలను చేజార్చనని బాధపడ్డాడు. విజయ సంబరాలు చేసుకుంటున్న జోరూట్, హ్యారీ బ్రూక్, జాక్ క్రాలీ సిరాజ్ను వెన్నుతట్టి అభినందించారు. ఓడినా.. అద్భుతంగా ఆడావ్ అని మెచ్చుకున్నారు. ఈ గెలుపుతో ఇంగ్లండ్ 2-1తో ఆధిక్యంలో నిలిచింది. ఇరు జట్ల మధ్య నాలుగో టెస్ట్ జూలై 23 నుంచి మాంచెస్టర్ వేదికగా ప్రారంభం కానుంది.