
ఆటగాళ్ల భద్రతపై హామీ ఇవ్వాలి
తాజాగా పీసీబీ సీఈవో వసీం ఖాన్ ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... ' 2021 టీ20 ప్రపంచకప్ను ఎక్కడ నిర్వహిస్తారనే విషయంపై స్పష్టత లేదు. ఒకవేళ ఈసారి మెగా ఈవెంట్ను వాయిదా వేస్తే దాన్ని 2022లో నిర్వహించే అవకాశం ఉంది. ఇక 2021 టీ20, 2023 వన్డే ప్రపంచకప్లకు భారత్ ఆతిథ్యమివ్వబోతోంది. ఆ టోర్నీలో ఆడేందుకు పాక్ జట్టుకి ఎలాంటి సమస్య లేకుండా బీసీసీఐ నుంచి లిఖితపూర్వక హామీ పత్రాన్ని ఇప్పించాలని ఐసీసీని కోరాం. వీసాలకి సంబంధించిన క్లియరెన్స్ కావాలి' అని అన్నారు.

బీసీసీఐతో పీసీబీకి మంచి సంబంధాలే
ఇంతకుముందు భారత్లో జరిగిన క్రీడా ఈవెంట్లలో పాక్ అథ్లెట్లకు అనుమతులు ఇవ్వలేదని, ఈ నేపథ్యంలో ఐసీసీ ఈవెంట్లకు సంబంధించి తాము ముందుగానే హామీ కోరుతున్నట్లు వసీం ఖాన్ తెలిపారు. భారత్-పాక్ ద్వైపాక్షిక క్రికెట్పై స్పందించిన ఆయన ప్రస్తుత పరిస్థితుల్లో ఇప్పుప్పుడే ఆ విషయం కొలిక్కి రాదన్నారు. బీసీసీఐతో పీసీబీకి మంచి సంబంధాలే ఉన్నా.. వాస్తవికంగా ఇరు జట్ల మధ్య ఇప్పట్లో క్రికెట్ జరగదన్నారు. ఐసీసీ ఛైర్మన్ పోటీలో బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ నిలబడితే పీసీబీ స్పందనేంటనగా.. ఈ విషయంపై ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదని, దాదా బరిలో ఉంటాడో లేదో తమకు తెలీదని చెప్పారు.

త్వరలోనే ఐసీసీ సమావేశం
2021లో నిర్వహించాల్సిన టీ20 ప్రపంచకప్ను ఎక్కడ జరుపుతారనే విషయంపై త్వరలోనే ఐసీసీ ఓ సమావేశం ఏర్పాటు చేయనుందని ఓ ఉన్నతాధికారి తెలిపారు. వైరస్ వ్యాప్తి కారణంగా ఈ ఏడాది ఆస్ట్రేలియాలో నిర్వహించాల్సిన 2020 టీ20 ప్రపంచకప్ వాయిదా పడే అవకాలున్నాయి. ఒకవేళ అది వాయిదా పడితే.. వచ్చే ఏడాది నిర్వహించాల్సిన 2021 టీ20 ప్రపంచకప్ను ఆస్ట్రేలియాలో నిర్వహించాలా లేక షెడ్యూల్ ప్రకారం భారత్లోనే ఆడించాలా అనే విషయంపై ఆ సమావేశంలో చర్చించే అవకాశం ఉందట.

ఐసీసీ టోర్నీల్లో మాత్రమే
భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య గత కొంతకాలంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇరు దేశాలు ఐసీసీ టోర్నీలు, ఆసియా కప్లో మాత్రమే తలపడుతున్నాయి. 2018 ఆసియా కప్కి భారత్ ఆతిథ్యమివ్వాల్సి ఉండగా.. పాక్ జట్టుని అనుమతించేందుకు భారత ప్రభుత్వం అనుమతి నిరాకరించడంతో టోర్నీని యూఏఈ వేదికగా బీసీసీఐ నిర్వహించింది. 2020 ఆసియా కప్ ఆతిథ్య హక్కులు పాక్ వద్ద ఉన్నాయి. అక్కడ ఆడేందుకు బీసీసీఐ నిరాకరించడంతో శ్రీలంక లేదా యూఏఈలో టోర్నీ నిర్వహించేందుకు పీసీబీ ప్లాన్ చేస్తోంది. వరుసగా ఐసీసీ టోర్నీలు ఉండడంతో బీసీసీఐ, పీసీబీలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాయి చూడాలి.
'భారత్పై ప్రతీకారం తీర్చుకుంటాం.. ఎప్పుడొస్తారా అని ఎదురు చూస్తున్నాం'


Click it and Unblock the Notifications












