ఆసియా కప్ 2025 ఫైనల్లో భారత్ చేతిలో చిత్తయిన పాకిస్థాన్ జట్టు దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. ఈ టోర్నీలో భారత్తో జరిగిన మూడు మ్యాచ్లకు మూడు ఓడటాన్ని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) సీరియస్గా తీసుకుంది. జట్టును బలోపేతం చేయడంపై ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే పాకిస్థాన్ క్రికెటర్లపై కఠిన ఆంక్షలు విధించేందుకు సిద్దమైంది. ముఖ్యంగా విదేశీ క్రికెట్ లీగ్స్ ఆడే విషయంలో తమ నిర్ణయాన్ని మార్చుకుంది.
ఇక నుంచి ఏ పాకిస్థాన్ ఆటగాడు కూడా విదేశీ ఫ్రాంచైజీ లీగ్ ఆడటానికి అనుమతివ్వద్దని భావిస్తోంది. ఇప్పటి వరకు జారీ చేసిన నో అబ్జక్షన్ సర్టిఫికేట్(ఎన్ఓసీ)లను రద్దు చేసి, భవిష్యత్తులో ఏ ఆటగాడికి ఎన్ఓసీ ఇవ్వకూడదని నిర్ణయించినట్లు సమాచారం. సాధారణంగా ఏదైనా విదేశీ క్రికెట్ లీగ్స్ ఆడాలంటే ఆటగాళ్లు వారి దేశ క్రికెట్ బోర్డుల నుంచి ఎన్ఓసీలు సమర్పించాల్సి ఉంటుంది.
ఈ క్రికెట్ లీగ్ ఆడటానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆటగాళ్లకు క్రికెట్ బోర్డులు ఇచ్చే లేఖనే ఎన్ఓసీ. భారత క్రికెటర్లు విదేశీ లీగ్స్ ఆడటాన్ని బీసీసీఐ ఎప్పుడో నిషేధం విధించింది. అందుకే భారత ఆటగాళ్లు ఎవరూ విదేశీ ఫ్రాంచైజీ లీగ్స్లో కనిపించరు. ఎవరైనా ఆడాలనుకున్నా.. అన్ని రకాల భారత క్రికెట్కు వీడ్కోలు పలికి పాల్గొనాల్సిందే. కౌంటీ క్రికెట్ మినహా మరే విదేశీ టోర్నీ ఆడటానికి బీసీసీఐ అనుమతివ్వదు. ఈ నిర్ణయంతోనే టీమిండియా ప్రతిభావంతమైన ఆటగాళ్లను తయారు చేయగలిగింది. ఇప్పుడు పీసీబీ కూడా ఇదే బాటలో నడవాలనుకుంటుంది.

ఈ విషయంపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల కాలేదు. కానీ ఆ దిశగా ఆలోచిస్తున్నామని పీసీబీ వర్గాలు తెలిపాయని పాకిస్థాన్ మీడియా పేర్కొంది. అయితే ఈ నిర్ణయాన్ని పాకిస్థాన్ ఆటగాళ్లు వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పాకిస్థాన్ క్రికెట్ పతనావస్థ దశలో ఉందని, స్వదేశంలో సరైన మౌలిక వసతులు కూడా ఉండవని ఆటగాళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విదేశీ లీగ్స్ ఆడకపోతే ఆటపరంగానే కాకుండా ఆర్థికంగా నష్టం వాటిల్లుంతని వారు ఆందోళనపడుతున్నారు.
పీసీబీ నుంచి వచ్చే ఆదాయం ఏమాత్రం సరిపోదని, అదే విదేశీ టీ20 లీగుల్లో ఆడటం వల్ల పెద్ద మొత్తం సంపాదించుకోవచ్చని అభిప్రాయపడుతున్నారు. అసలు ఆసియా కప్ ఫైనల్కు రావడానికి విదేశీ లీగ్స్ ఆడటమే ఓ కారణమని వాదిస్తున్నారు. పీసీబీ మాత్రం మరోలా ఆలోచిస్తుంది. విదేశీ లీగ్స్ ఆడటం వల్ల ఆటగాళ్లలో నిలకడ లోపిస్తుందనే ఉద్దేశంలో ఉంది. ముందుగా పీసీబీలోని అవినీతి, రాజకీయాలను తగ్గిస్తే జట్టు బాగుపడుతుందని ఓ పాక్ మాజీ క్రికెటర్ తెలిపాడు.