ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా భారత్, పాకిస్థాన్ మధ్య జరగాల్సిన హైఓల్టేజ్ మ్యాచ్పై అనిశ్చితి నెలకొంది. కొలంబో వేదికగా ఆదివారం జరగాల్సిన ఈ మ్యాచ్ను బహిష్కరిస్తున్నామని పాకిస్థాన్ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. బంగ్లాదేశ్కు సంఘీభావంగా ఈ నిర్ణయం తీసుకున్నామని పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రకటించిన విషయం విదితమే.
భారత్తో మ్యాచ్ ఆడేందుకు తమ ప్రభుత్వం అనుమతించడం లేదని ఐసీసీకి పీసీబీ తెలిపింది. తద్వారా ఐసీసీ విధించే ఆంక్షలను తప్పించుకోవాలని ఎత్తుగడ వేస్తోంది. అయితే రూ.4500 కోట్ల వ్యాపారంతో ముడిపడి ఉన్న ఈ మ్యాచ్ను ఎలాగైనా నిర్వహించాలనే పట్టుదలతో ఐసీసీ ఉంది. ఈ క్రమంలోనే పీసీబీతో ఐసీసీ చర్చలు జరిపింది. లాహోర్లో ఆదివారం పీసీబీ ఛైర్మన్ మోహిసిన్ నఖ్వీతో ఐసీసీ డిప్యూటీ ఛైర్మన్ ఇమ్రాన్ ఖవాజా, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ప్రెసిడెంట్ అమీనుల్ ఇస్లాం సమావేశమయ్యారు.
ఐదు గంటలకు పైగా సాగిన ఈ సమావేశంలో ఐసీసీని పాకిస్థాన్ గొంతెమ్మ కోరికలు కోరినట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్ క్రికెట్ అభివృద్ధి కోసం ఐసీసీ నుంచి మరిన్ని నిధులు ఇవ్వడం, టీ20 ప్రపంచకప్లో పాల్గొననప్పటికీ బంగ్లాదేశ్కు పార్టిసిపేషన్ ఫీజు మంజూరు చేయడం, భవిష్యత్లో బంగ్లాదేశ్కు ఐసీసీ ఈవెంట్ ఆతిథ్య హక్కులు ఇవ్వడంతో పాటు ఐసీసీ రెవెన్యూలో తమ వాటాను పెంచడం, భారత్తో ద్వైపాక్షిక సిరీస్లు పునరుద్దరించడం, భారత ఆటగాళ్లు షేక్ హ్యాండ్ ఇచ్చేలా ప్రొటోకాల్స్ జారీ చేయడం వంటి డిమాండ్స్ ఉంచినట్లు తెలుస్తోంది.

అయితే ఈ డిమాండ్స్కు ఐసీసీ అంగీకరించిందా? లేదా? అనే విషయంపై క్లారిటీ లేదు. ఈ క్రమంలోనే భారత్తో మ్యాచ్ ఆడే విషయంపై పాకిస్థాన్కు ఐసీసీ 24 గంటల డెడ్లైన్ విధించినట్లు తెలుస్తోంది. ఈ చర్చల సారాంశాన్ని పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్కు పీసీబీ ఛైర్మన్ మోహ్సిన్ నఖ్వీ వివరిస్తాడని, ప్రధానిదే తుది నిర్ణయమని పాకిస్థాన్ మీడియా పేర్కొంది. షెహబాజ్ షరీఫ్ సూచనల మేరకే పీసీబీ నడుచుకుంటుందని స్పష్టం చేసింది.
ఐసీసీ తీసుకునే ఏ నిర్ణయానికైనా బీసీసీఐ కట్టబడి ఉంటుందని బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ శుక్లా తెలిపాడు. ఈ వ్యవహారంపై బీసీసీఐ తరఫున ఎలాంటి కామెంట్ చేయం. ఐసీసీ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటాం.
తమ ఆటగాళ్ల భద్రత నేపథ్యంలో భారత్లో పర్యటించలేమని, తమ ప్రపంచకప్ మ్యాచ్లను శ్రీలంకకు తరలించాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు(బీసీబీ) చేసిన విజ్ఞప్తిని ఐసీసీ తోసిపుచ్చింది. బంగ్లా ఆటగాళ్ల భద్రతకు ఎలాంటి ముప్పలేని హామీ ఇచ్చింది. అయినా బంగ్లాదేశ్ వినకుండా టోర్నీ నుంచి తప్పుకుంది. దాంతో ఐసీసీ స్కాట్లాండ్కు అవకాశం కల్పించింది.
ఈ నిర్ణయాన్ని పీసీబీ తప్పుబట్టింది. భారత్కు ఒక న్యాయం? బంగ్లాదేశ్ ఒక న్యాయమా? అని మండిపడింది. ఐసీసీ టీ20 ప్రపంచకప్ మొత్తానికి దూరంగా ఉంటామని హెచ్చరించింది. చివరకు భారత్తో మ్యాచ్ను మాత్రమే ఆడమని తమ నిరసనను తెలియజేస్తోంది.