ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఆతిథ్య దేశంగా తమను హోరంగా అవమానించారని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఆరోపిస్తోంది. మూడు సందర్భాల్లో తమను అవమానించారని ఐసీసీపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఐసీసీ తీరును తప్పుబడుతూ వారు తమ నిరసనను తెలిపేందుకు కూడా సిద్దమైనట్లు పాకిస్థాన్ మీడియా పేర్కొంది.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఆతిథ్యం ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ టోర్నీ కోసం పాకిస్థాన్లో పర్యటించేందుకు బీసీసీఐ నిరాకరించడంతో హైబ్రిడ్ మోడల్లో ఈ టోర్నీని నిర్వహించారు. భారత్ మ్యాచ్లు తటస్థ వేదికైన దుబాయ్ వేదికగా జరిగాయి. పాకిస్థాన్ జట్టు వరుస పరాజయాలతో లీగ్ దశలోనే ఒక్క విజయం నమోదు చేయకుండా టోర్నీ నుంచి నిష్క్రమించగా.. భారత్ మాత్రం ఓటమెరుగని జట్టుగా టైటిల్ కైవసం చేసుకుంది.

అయితే ఈ టోర్నీ నిర్వహణ సందర్భంగా ఐసీసీ తమను ఘోరంగా అవమానించిందని పాకిస్థాన్ ఆరోపిస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీ ప్రజెంటేషన్ వేడుకలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు నుంచి ఒక్క అధికారి కూడా వేదికపై లేడని, పీసీబీ ఛైర్మన్ ఒక్కరినే ఆహ్వానించారని పీసీబీకి చెందిన ఓ అధికారి మీడియాకు తెలిపారు. ఒక్కరినే ఆహ్వానించడంతో పీసీబీ ఛైర్మన్ కూడా హాజరు కాలేదన్నారు.
'ట్రోఫీ ప్రజెంటేషన్ కార్యక్రమానికి ఆతిథ్య క్రికెట్ బోర్డును ఆహ్వానించలేదు. పీసీబీ ఛైర్మెన్కు మాత్రమే ఆహ్వానం అందింది. ఆయన కూడా వెళ్లలేదు. అంతేకాకుండా భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్లో ఛాంపియన్స్ ట్రోఫీ లోగోలో పాకిస్థాన్ పేరు లేదు. ఆ తర్వాత జరిగిన మ్యాచ్లకు పాకిస్థాన్ పేరు చేర్చారు. లాహోర్ వేదికగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా భారత జాతీయ గీతాన్ని ప్లే చేశారు. ఈ మూడు సందర్భాల్లో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఐసీసీ అవమానించింది. ఈ ఘటనలపై ఐసీసీ ముందు మేం నిరసనను తెలియజేస్తాం. ఈ ఘటనల పట్ల వివరణ కూడా కోరుతాం.'అని సదరు అధికారి మీడియాకు తెలిపారు.
ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జాతీయ గీతాలకు బదులు పొరపాటున భారత జాతీయ గీతం ప్లే అయ్యింది. సాంకేతిక లోపంతో ఈ ఘటన జరిగిందని ఐసీసీ వివరణ ఇచ్చింది. ఇక ఫైనల్ మ్యాచ్కు పీసీబీ ప్రెసిడెంట్ రాలేదని, దాంతోనే మిగతా వారిని ఆహ్వానించలేదని ఐసీసీ పేర్కొంది.