వెంకీ పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్లుంది పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) పరిస్థితి. అసలే తమ మాటను ఐసీసీ పట్టించుకోవడం లేదనే బాధలో ఉన్న ఆ బోర్డుకు ఊహించని షాక్ తగిలింది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) నూతన ఛైర్మన్గా జై షా ఎంపికవ్వడం పీసీబీకి మింగుడుపడటం లేదు.
ప్రస్తుతం భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) సెక్రటరీగా ఉన్న జై షా.. డిసెంబర్ 1న ఐసీసీ ఛైర్మన్గా బాధ్యతలు స్వీకరించనున్నాడు.
ఐసీసీ ప్రస్తుత ఛైర్మన్ గ్రెగ్ బార్క్లే పదవీకాలం నవంబర్ 30తో ముగియనుంది.ఐసీసీ ఛైర్మన్ పోస్ట్ కోసం నామినేషన్లు వేసేందుకు మంగళవారం(ఆగస్ట్ 27) ఆఖరి రోజు కాగా.. జై షా రేసులో నిలవడంతో మరెవరూ పోటీ చేయడానికి ముందుకురాలేదు. దాంతో జై షా ఎన్నిక ఏకగ్రీవమైంది. జై షా ఎన్నికను వ్యతిరేకించాలనుకున్న పీసీబీకి అతని ఏక గ్రీవ ఎన్నిక షాక్కు గురి చేసింది.ఇక ఐసీసీ ఛైర్మన్గా ఎన్నికైన అత్యంత పిన్నవయస్కుడిగా జై షా చరిత్ర సృష్టించాడు. 35 ఏళ్ల వయసులోనే అతను ఈ అత్యున్నత పదవిని స్వీకరించాడు. ఐసీసీ ఛైర్మన్గా ఎంపికైన ఐదో భారతీయుడిగా జైషా నిలిచాడు. జగన్మోహన్ దాల్మియా, శరద్ పవార్, ఎన్ శ్రీనివాసన్, శశాంక్ మనోహర్లు భారత్ నుంచి ఐసీసీ ఛైర్మన్గా ఎన్నికయ్యారు.

ఐసీసీ ఛైర్మన్గా జై షా ఎన్నికవ్వడంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు భయం గుప్పిట్లోకి వెళ్లిపోయింది. ముఖ్యంగా ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విషయంలో జై షా సహకరిస్తాడా? లేదా? అనే ఆందోళన పీసీబీకి నెలకొంది. బీసీసీఐ సెక్రటరీగా టీమిండియాను పాకిస్థాన్కు పంపించేందుకు నిరాకరించిన జై షా.. ఐసీసీ ఛైర్మన్గా మళ్లీ ఏం తిరకాసు పెడుతాడోనని పీసీబీ భయపడుతోంది.
షెడ్యూల్ ప్రకారం ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు పాకిస్థాన్ వేదికగా జరగాల్సి ఉంది. ఇప్పటికే ఈ టోర్నీ నిర్వహణ కోసం పీసీబీ వందల కోట్లు ఖర్చు చేస్తోంది. కరాచీ, గడాఫీ, రావల్పిండి స్టేడియాలను ఆధునీకరిస్తోంది. మరోవైపు భారత్ మాత్రం.. పాకిస్థాన్కు వచ్చేది లేదని, సెక్యూరిటీ సమస్యలు వస్తాయని, తటస్థ వేదికగా తమ మ్యాచ్లను నిర్వహించాలని ఐసీసీని కోరుతోంది. మరోవైపు పాకిస్థాన్ మాత్రం హైబ్రిడ్ మోడల్కు ఒప్పుకోమని, తమకు తీవ్ర నష్టమని వాదిస్తోంది.
ఇలాంటి పరిస్థితుల్లో జై షా నూతన ఛైర్మన్గా ఎన్నికవ్వడంతో పీసీబీ భయం రెట్టింపు అయ్యింది. సెక్యూరిటీ విషయంలో ఏ మాత్రం తేడా వచ్చినా.. టోర్నీని పాకిస్థాన్ నుంచి తరలిస్తారనే భయం వెంటాడుతోంది. గతంలో ఆసియా క్రికెట్ అసోసియేషన్(ఏసీఏ) ఛైర్మన్గా ఉన్న జైషా.. ఆసియాకప్ నిర్వహణ విషయంలో ఇదే పరిస్థితిని ఎదుర్కొన్నాడు. అప్పుడు హైబ్రిడ్ మోడల్లో టోర్నీ నిర్వహించాడు. భారత్ మ్యాచ్లను తటస్థ వేదికగా జరిపారు. ఇప్పుడు కూడా అలానే నిర్వహించే అవకాశం ఉంది.