న్యూఢిల్లీ: వన్డే ప్రపంచకప్లో భాగంగా అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా భారత్-పాకిస్థాన్ మ్యాచ్ జరగనుందని వస్తున్న వార్తలపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ నజమ్ సేథీ స్పందించాడు. రాజకీయ కోణంలో భాగంగానే భారత్-పాక్ మ్యాచ్కు అహ్మదాబాద్ను వేదికగా ఎంపిక చేస్తున్నారని ఆరోపించాడు.
ఆసియాకప్ 2023 కోసం పాకిస్థాన్కు రాలేమని భారత్ చెప్పడం ఇరు దేశాల ఐసీసీ మ్యాచ్లపై ప్రభావం చూపుతుందన్నాడు. భారత్ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్తో పాటు పాకిస్థాన్ వేదికగా జరగనున్న 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో దాయాదీ దేశాలకు ఇబ్బంది అవుతుందన్నాడు.

'ఆసియాకప్ 2023ను భారత్ తటస్థ వేదికగా ఆడాలనుకుంటే.. మేం ప్రతిపాదించిన హైబ్రిడ్ మోడల్ను అంగీకరిస్తే మేం కూడా వన్డే ప్రపంచకప్ కోసం అదే హైబ్రిడ్ కాన్సెప్ట్ కావాలని డిమాండ్ చేస్తాం. ప్రపంచకప్లో పాకిస్థాన్ ఆడే మ్యాచ్లను బంగ్లాదేశ్లోని ఢాకా లేదా భారత్ ఆమోదించిన బయటి వేదికల్లో ఆడించాలని కోరుతాం. పాక్ వేదికగా జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా ఇదే పద్దతిని కొనసాగిస్తాం.
ఫలితంగా ఇరు దేశాల మధ్య ఉన్న రాజకీయ ప్రతిష్టంభను అధిగమించవచ్చు. క్రికెట్ పరంగా ఇరుదేశాల సత్సంబంధాలు పెంచుకునేందుకు ఇది మంచి వ్యూహం. ఇతర దేశాలు ఎలాగో పాక్కు వచ్చి ఆడేందుకు సుముఖంగా ఉన్నాయి. వన్డే ప్రపంచకప్లో భాగంగా భారత్-పాక్ మధ్య జరిగే మ్యాచ్కు అహ్మదాబాద్ వేదికను ఖరారు చేసినట్లు విన్నాను.
ఈ విషయం తెలిసిన తర్వాత నవ్వుకున్నాను. భారత్కు మేం రావద్దనే ఇలా చేస్తున్నారని నాలో నేను అనుకున్నా. కోల్కతా, చెన్నై వేదికగా మ్యాచ్లు జరుపుతారంటే దానికి ఓ అర్థం ఉంటుంది. నేను రాజకీయాల జోలికి పోదలుచుకోవడం లేదు. కానీ అహ్మదాబాద్ వేదికగా భారత్-పాక్ మ్యాచ్ అంటేనే రాజకీయ కోణం ఉందనే విషయం స్పష్టం అర్థమవుతోంది.
ఎందుకంటే మాకు భద్రతా పరంగా సమస్యలున్న ఏకైక ప్రాంతం అది. అహ్మదాబాద్ వేదిక గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. అహ్మదాబాద్లో మిమ్మల్ని ఆడించబోతున్నాం. మీకు మీరు జాగ్రత్తగా ఉండండని చెప్పినట్లు ఉంది. అహ్మదాబాద్ను ఎవరు పాలిస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.'అని పీసీబీ చీఫ్ ఇండియన్ ఎక్స్ప్రెస్తో చెప్పుకొచ్చాడు.
ఓవైపు ఆసియాకప్ 2023 నిర్వహణపై అనిశ్చితి కొనసాగుతుండగా.. మరోవైపు వన్డే ప్రపంచకప్ ఆడే విషయంపై పాకిస్థాన్ స్పష్టత ఇవ్వడం లేదు. లిఖిత పూర్వకంగా ఇప్పటి వరకు ఎలాంటి భరోసా ఇవ్వలేదని ఓ ఐసీసీ అధికారి తెలిపాడు.