అండర్ 19 ఆసియా కప్ ఫైనల్లో భారత కుర్రాళ్లు నిబంధనలకు విరుద్దంగా ప్రవర్తించారని, వారిపై ఐసీసీకి ఫిర్యాదు చేస్తామని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఛైర్మెన్ మోహ్సిన్ నఖ్వీ తెలిపారు. ఐసీసీ రూల్స్ ప్రకారం రాజకీయాలకు క్రికెటర్లు దూరంగా ఉండాలని, కానీ భారత ఆటగాళ్లు తమ పట్ల అనుచితంగా ప్రవర్తించారని నఖ్వీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మైదానంలో కూడా తమ ఆటగాళ్లను తరుచూ రెచ్చగొట్టారని తెలిపారు. భారత ఆటగాళ్లపై అధికారికంగా ఐసీసీకి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఆదివారం జరిగిన అండర్ 19 ఆసియాకప్ 2025 ఫైనల్లో పాకిస్థాన్ అండర్ 19 టీమ్ 191 పరుగుల భారీ తేడాతో భారత్ను చిత్తు చేసిన సంగతి తెలిసిందే. ఈ విజయం నేపథ్యంలో సోమవారం ఇస్లామాబాద్లో ప్రధాని షెహ్బాజ్ షరీఫ్ను పాకిస్థాన్ అండర్ 19 టీమ్ కలిసింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మోహ్సిన్ నఖ్వీ అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. భారత ఆటగాళ్ల తీరును తప్పుబట్టాడు.

ఫైనల్ అనంతరం మోహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా రన్నరప్ మెడల్స్ స్వీకరించేందుకు భారత అండర్ 19 టీమ్ ఆటగాళ్లు నిరాకరించారు. దాంతో ఐసీసీ అసోసియేట్ డైరెక్టర్ ముబష్శిర్ ఉస్మానీ చేతుల మీదుగా భారత ఆటగాళ్లు మెడల్స్ అందుకున్నారు. ఈ ఘటనపై నఖ్వీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రధానితో సమావేశం అనంతరం నఖ్వీ భారత ఆటగాళ్లపై మండిపడ్డాడు.
సీనియర్ ఆటగాళ్ల ఆసియా కప్ సందర్భంగా కూడా నఖ్వీ చేతుల మీదుగా టైటిల్ అందుకునేందుకు భారత ఆటగాళ్లు నిరాకరించారు. దాంతో నఖ్వీ ట్రోఫీని తన వెంట తీసుకెళ్లాడు. ఇప్పటి వరకు భారత్కు అందజేయలేదు. ఈ ఘటనపై ఇరు జట్లు ఐసీసీకి ఫిర్యాదు చేశాయి.
భారత ఆటగాళ్ల వ్యవహర శైలిని పాకిస్థాన్ అండర్ 19 టీమ్ మెంటార్ సర్ఫరాజ్ అహ్మద్ కూడా తప్పుబట్టాడు. భారత కుర్రాళ్లు క్రీడా స్ఫూర్తికి విరుద్దంగా వ్యవహరించారని మండిపడ్డాడు. 'గతంలో మేం క్రికెట్ను గౌరవించే భారత జట్టుతో ఆడాం. కానీ ఈ కుర్రాళ్లు ప్రవర్తించిన తీరు అగౌరవంగా ఉంది. గెలుపు సంబరాలు గౌరవప్రదంగా ఉండాలని నేను మా ఆటగాళ్లకు చెప్పాను.
మా కుర్రాళ్లు ఈ ఫార్మాట్లో తమ సామర్థ్యాన్ని నిరూపించుకోవాలని నేను ఆశించాను. మా ఆటగాళ్లకు నేను చెప్పింది ఒక్కటే.. మీ మీద మీరు నమ్మకం ఉంచండి, ప్రత్యర్థులు ఏం చేసినా పట్టించుకోవద్దని చెప్పాను. క్రీడల పట్ల భారత్ తీరు సరిగ్గా లేదు. ఈ టోర్నీలో భారత జట్టు ప్రవర్తించిన తీరు అనైతికం. మేం అయితే క్రీడాస్ఫూర్తితోనే విజయ సంబరాలు జరుపుకున్నాం. భారత్ ఏం చేసింది అనేది వారి స్వయంకృతం.'అని సర్ఫరాజ్ అహ్మద్ అన్నాడు.